ఖమ్మం, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం కష్టించి సేద్యం చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా రైతుబంధు, రైతుబీమాతో కర్షకులకు ధీమా కల్పిస్తున్నది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది. అంతేకాదు.. సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు, సమావేశాలు, అవగాహన సదస్సుల నిర్వహణ కోసం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఖమ్మం జిల్లాలో 129 క్లస్టర్లను ఏర్పాటు చేసి 129 రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా రైతు వేదికల నిర్వహణ, వాటి ద్వారా కర్షకులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక నుంచి ఒక్కో రైతు వేదిక నిర్వహణకు రూ.9 వేల చొప్పున అందజేసేందుకు నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 129 రైతు వేదికలకు గాను ప్రతినెలా రూ.11 లక్షలను విడుదల చేయనున్నది. ఈ నిధులతో రైతు వేదికల కరెంట్ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని శపథం చేస్తున్నారు.
రైతులకు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టిసారించింది. నిరుటి నుంచి జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్ఎస్ సర్కారు వాటి నిర్వహణపై, తద్వారా రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తోంది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. వివిధ రకాల శిక్షణలకు అనుకూలంగా ఉండేలా రైతు వేదికలను నిర్మించారు. క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) కార్యాలయాన్ని కూడా అందులోనే ఏర్పాటు చేశారు. మొత్తం 129 రైతువేదికలకు గాను 31 మంది దాతలు తమ సొంత స్థలాలను అందించారు.
మిగిలిన రైతు వేదికలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారు. దాదాపు రూ.22 – 25 లక్షల వ్యయంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణలు తమ సొంత ఖర్చులతో తలా ఒక రైతు వేదికను నిర్మించి రైతులకు అందజేశారు. మిగిలిన 125 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 31 చోట్ల 31 మంది దాతలు రైతు వేదికల నిర్మాణం కోసం తమ స్థలాలను దానం చేశారు. ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలను వెచ్చించింది. వేదికల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.3 వేలను వెచ్చిస్తోంది. రైతుల సమావేశాల నిమిత్తం కుర్చీలు, టేబుళ్లను సైతం అందజేసింది. అయితే వేదికల్లో ఇక నుంచి నిరంతం శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో నిర్వహణ నిమిత్తం అందజేసే నిధులను మరింత పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నుంచి ప్రతి నెలా రూ.9 వేలు..
రైతు వేదికల్లో శిక్షణ ద్వారా రైతులను మరింత సుశిక్షితులను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఇక నుంచి ఒక్కో రైతు వేదిక నిర్వహణకు రూ.9 వేల అందజేయనున్నది. ఇలా జిల్లాలోని 129 రైతు వేదికలకు గాను రూ.11 లక్షలను విడుదల చేయనుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి మొత్తం రూ.45 వేల చొప్పున 129 రైతు వేదికలకు గాను రూ.58.05 లక్షలను రెండు రోజుల క్రితం విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఇక నుంచి రైతువేదికల కరెంట్ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. రైతు శిక్షణ కార్యక్రమాలు కూడా విధిగా జరుగనున్నాయి. ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ, టిఫిన్లను సైతం అందించనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గాను వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతోపాటు మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్, హైదరాబాద్ శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో ఇక నుంచి వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు, వాణిజ్య పంటల సాగు పూర్తిగా నూతన పద్ధతిలో జరుగనుంది.
మెరుగైన సేవలకు దోహదం
రైతువేదికల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.9 వేలను ప్రభు త్వం అందిస్తుండడం.. రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు దోహదం కలుగుతుంది. ఈ నిధులతో అన్ని రకాల వసతులూ కల్పించేందుకు వీలవుతుంది. ఇప్పటికే ప్రతి నెలా మూడు నుంచి ఐదు వరకు రైతుల సమావేశాలు జరుగుతున్నాయి. ఇక నుంచి రైతు శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయనున్నాం.
–ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం