ఖమ్మం, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని పక్కనబెట్టి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. దివ్యాంగులమనే భావనను మనసులో నుంచి తీసివేయాలని, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఎందరో దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణిస్తున్నట్లు వివరించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఒక్కొక్కరికీ రూ. 3016 చొప్పున జిల్లాలో 29 వేల మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, చేతి కర్రలు, త్రీ వీలర్ స్కూటీలను అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలోనూ 5 శాతం ప్రత్యేక కోటా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ విభాగాన్ని దివ్యాంగుల సాధికారత శాఖగా నూతన శాఖను ఏర్పాటు చేసిందని తెలిపారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ కేక్ కట్ చేశారు. దివ్యాంగుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదా నం చేశారు. ఉపాధి హామీ దివ్యాంగ కూలీలను సన్మానించారు. జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, డీఆర్డీవో విద్యాచందన, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, దివ్యాంగుల సంఘం బాధ్యులు ఉప్పలయ్య, సురేశ్, నాగరాజు పాల్గొన్నారు.
వైకల్యం అడ్డుకాదు: భద్రాద్రి కలెక్టర్
ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకెళ్తే వైకల్యమేమీ అడ్డుకాదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఎందరో దివ్యాంగులు తమ వైకల్యాన్ని జయంచి వివిధ రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 27వ వార్డు ఏ పవర్ బస్తీలో రూ.10 లక్షల సింగరేణి సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న దివ్యాంగుల కమ్యూనిటీ భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దివ్యాంగుల పట్ల వివక్ష చూపకుండా సహకారం అందిస్తూ వారికి అండగా నిలవాలని కోరారు. జిల్లాలో 14,032 మందికి ప్రతి నెలా రూ.3,016 చొప్పున రూ.4.23 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 408 బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్లు, సెన్సార్ చేతి కర్రలను పంపిణీ చేసినట్లు వివరించారు. దివ్యాంగుల నృత్య పోటీలు ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీడబ్ల్యూవో వరలక్ష్మి, డీఆర్డీవో మధుసూదన్రాజు, కమిషనర్ రఘు, కౌన్సిలర్ ప్రసాద్, తహసీల్దార్ రామకృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సతీశ్ పాల్గొన్నారు.