ఖమ్మం సిటీ, మే 19: ‘ రామయ్య గారూ.. ఎలా ఉన్నారు..? మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందకండి. మీ కోసం సీఎం కేసీఆర్ మమ్మల్ని పంపించారు. మీకు అండగా మే మున్నాం..’ అని రోడ్డుప్రమాదంలో గాయపడి ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్యను గురువారం రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి చైర్మన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
‘రోడ్డు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా చూడాలి.. ఒక మంచి ముహూర్తంలో అతడితో వంద మొక్కలు నాటించండి’ అని వనజీవి రామయ్య రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను కోరారు. వెంటనే మంత్రులు స్పందించి ద్విచక్రవాహనదారుడితో వంద మొక్కలు కాదు.. ఏకంగా వెయ్యి మొక్కలు నాటిద్దామని చమత్కరించారు.
దీంతో అక్కడ నవ్వులు పూశాయి. అనంతరం వనజీవి రామయ్య మాట్లాడుతూ.. ‘నాకు సీఎం కేసీఆర్ సార్ను కలవాలని ఉంది. అపాయింట్మెంట్ ఇప్పించండి’.. అని మంత్రులను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రులు పూర్తిగా కోలుకున్న తర్వాత అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.