ఖమ్మం, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం డైట్ కళాశాల ఇక నుంచి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా మారనున్నది. డిజిటల్ సదుపాయాలతో ల్యాబ్లు, సెమినార్ హాళ్లు ఏర్పడనున్నాయి. ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు అన్ని రకాలుగా శిక్షణ కల్పించేలా తీర్చిదిద్దనున్నారు. దీంతోపాటు అధునాతన సౌకర్యాలు కూడా సమకూరనున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర విద్యా శాఖ రాష్ట్రంలో రెండు డైట్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేయగా.. అందులో ఒకటి ఖమ్మం డైట్ కళాశాల ఉండడం విశేషం. ఖమ్మం డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేయడంతోపాటు వసతులు కల్పించేందుకు రూ.8 కోట్ల్ల నిధులను కేంద్ర విద్యా శాఖ కేటాయించనున్నది.
జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్-డైట్) ఖమ్మంలో 10 ఎకరాలు సువిశాల ప్రాంగణంలో 1989లో ప్రారంభమైంది. 1989 నుంచి 2000 వరకు డీఈడీ కోర్సు ఏడాది కాల వ్యవధితో ఉండేది. 2000 సంవత్సరం నుంచి డీఈడీ కోర్సును రెండేళ్ల కోర్సుగా మార్పులు చేశారు. ప్రథమ సంవత్సరంలో వంద సీట్లు, ద్వితీయ సంవత్సరంలో వంద సీట్లు కేటాయించేవారు. 2015 నుంచి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో డీఈడీని అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని శిక్షణ కార్యక్రమాలు ఈ డైట్ కళాశాల కేంద్రంగానే నిర్వహిస్తున్నారు.
డైట్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లుగా గుర్తించేందుకు డైట్ కళాశాలల్లో ఉన్న అన్ని అంశాలను ఎస్సీఈఆర్టీ అధికారులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో గల 10 డైట్ కళాశాలలను పరిశీలించి.. వాటిల్లో ప్రధానంగా డీఈడీ విద్యార్థుల ఐదేళ్ల ఫలితాలు, కళాశాలలో జరిగిన శిక్షణలు, డీఈడీ శిక్షణలో విద్యార్థులు ఉత్తీర్ణతా శాతాలు, కళాశాల పరిసరాల పరిశుభ్రత వంటివి పరిశీలించారు. దివ్యాంగ విద్యార్థుల ర్యాంపు, డిజిటల్ లైబ్రరీ, కళాశాల వెబ్సైట్, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ వంటి అంశాలపై నివేదికలు, ఫొటోల రూపంలో అక్టోబర్లోనే కేంద్ర విద్యాశాఖకు సమర్పించారు. వీటితోపాటు హాస్టల్ నిర్వహణ, బాలికలు వేచి ఉండే గది వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. కళాశాల వివరాలన్నీ కేంద్రానికి పంపించారు. నవంబర్లో ప్రిన్సిపాళ్ల మీటింగ్ నిర్వహించి కళాశాలల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. కళాశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ నుంచి ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ సేకరించారు. నిర్దేశిత 100 పాయింట్లకుగాను ఖమ్మం డైట్ కళాశాలకు 79 పాయింట్స్ వచ్చాయి. దీంతో ఈ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ)గా గుర్తించారు.
ప్రస్తుతం డైట్లో డీఈడీ కోర్సు మాత్రమే నిర్వహిస్తుండగా.. ఇకపై సీవోఈతో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సు కూడా రానున్నది. దీని ఆధారంగా అంగన్వాడీ పిల్లలకు, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు బోధించేందుకు అవసరమైన టీచర్లు సిద్ధమవుతారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణ కోసం కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
కళాశాలకు రూ.8 కోట్లతో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. 300 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియాన్ని నిర్మిస్తారు. డిజిటల్ సదుపాయాలతో సెమినార్ హాళ్లు, లెక్చర్ హాళ్లు, సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, మ్యాథ్స్, ఇంగ్లిష్, తెలుగు ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, సోలార్ ప్యానెల్స్ వంటి వాటిని అందుబాటులోకి తెస్తారు. ప్రిన్సిపాల్కు, సిబ్బందికి క్వార్టర్స్, కళాశాలకు రక్షణగా చుట్టూ 10 అడుగుల ఎత్తుతో ప్రహరీ నిర్మిస్తారు. ఇంటర్నల్ రోడ్లు, బాలబాలికలకు వేర్వరు వసతి గృహాలు నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించారు.
ఖమ్మం డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేయడం గర్వకారణం. ఇప్పటికే ఏటా ఉపాధ్యాయులకు అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నాం. సీవోఈగా ఎంపికైన ఈ కళాశాలను రాష్ట్రంలో ఆదర్శ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉపాధ్యాయులకు తొలిమెట్టు, ఉన్నతి, ప్రధానోపాధ్యాయులకు లీడర్షిప్ అంశాలపై శిక్షణ కల్పిస్తున్నాం. వీటితోపాటు నూతన కోర్సులు, మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి.