కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
ఉమ్మడి జిల్లాలో 83 కేంద్రాలు
45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ తప్పనిసరి
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 11:చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తున్నది.. ‘సెకండ్ వేవ్’ ఊపందుకుని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నివారణ చర్యలపై దృష్టి సారించింది.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.. ఉమ్మడి జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు పక్కా ప్రణాళికతో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇప్పటివరకూ 1.20 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే కార్మికులు, ఉద్యోగులు పనిచేసే స్థలానికి వెళ్లి వైద్య సిబ్బంది టీకా వేస్తున్నారు.
కరోనా మహమ్మారి మళ్లీ గజగజ వణికుస్తున్నది. ‘సెకండ్ వేవ్’ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. వయోభేదం లేకుండా వైరస్ వ్యాపిస్తున్నది. రోజుకురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వైరస్ కట్టడిపై దృష్టి సారించింది. ఒకవైపు నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించింది. ఈమేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. తొలుత ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ వైద్యారోగ్యశాఖ వ్యాక్సిన్ ఇచ్చింది. వైరస్ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత 45 ఏండ్లు దాటిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నది. మొదట్లో ప్రజల్లో టీకాపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో క్రమంగా వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నది. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని మరీ టీకా తీసుకుంటున్నారు.
పకడ్బందీగా కార్యాచరణ..
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 45 ఏండ్లు దాటిన వారందరికీ వైద్యులు ఉచితంగా టీకా ఇస్తున్నారు. హెల్త్వర్కర్లు, పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తూ అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలకు టీకాలు వేస్తూ సాధారణ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. వాడవాడలా చాటింపు వేయించి టీకా వేయించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో టీకా ఇలా..
ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లాకు కోవిషీల్డ్ టీకా 61,360 డోస్లు, కోవాగ్జిన్ 11,540 డోస్లు కేటాయించింది. వైద్యారోగ్యశాఖ పరిధిలో 30 ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల పరిధిలో ఏడు కలిపి జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 61,138 మంది టీకాలు తీసుకున్నారు. వారిలో మొదటి డోస్ తీసుకున్నవారు 48,792 మంది, రెండో డోస్ తీసుకున్నవారు 12,346 మంది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శనివారం నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో కలిపి 36,264 మందికి మొదటి డోస్, మరో 2,488 మందికి రెండో డోస్ వేశారు. సర్కారు దవాఖానల్లో ఉచితం గానూ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 250 తీసుకుని వ్యాక్సిన్ వేస్తున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
రోనా వ్యాప్తిపై భద్రాద్రి జిల్లాలో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. వైరస్వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. విధిగా మాస్క్లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. అతిక్రమిస్తే ప్రభుత్వం పరంగా చర్యలు ఉంటాయి.
-ఎల్.భాస్కర్నాయక్, డీఎంహెచ్వో, భద్రాద్రి కొత్తగూడెం
ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలి
రెండవ దశ కరోనా వేగంగా వ్యాపిస్తున్నది. ప్రజలు ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి మాస్క్ విధిగా ధరించాలి. అదే విధంగా 45 ఏండ్లు దాటిన వారంతా తప్పకుండా టీకా వేయించుకోవాలి. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా ఇస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250 చెల్లిస్తే వ్యాక్సిన్ ఇస్తారు. మిగతా ప్రభుత్వశాఖల సహకారంతో వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకుంటాం.
ఇవి కూడా చదవండి
సెరోజా తుఫాన్ బీభత్సం.. 177కు చేరిన మృతులు
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం
పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు చూపుతారు