కారేపల్లి, సెప్టెంబర్ 3: కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ (Thammisetty Srinivas) ‘రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడి’గా ఎంపికయ్యారు. చరిత్ర సబ్జెక్టు బోధించే శ్రీనివాస్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆయన పేరును రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎన్. విజయకుమారి తెలిపారు. శ్రీనివాస్కు ఈ గౌరవం లభించడం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
చరిత్ర అధ్యాపకుడిగా విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు, విద్యారంగంలో పలు కీలక బాధ్యతలను శ్రీనివాస్ సమర్థంగా నిర్వహించారు. టెక్స్ట్బుక్ రైటర్గా, మాస్టర్ ట్రైనర్గా, డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో ఆయన విశేషంగా సేవలందించారు. ప్రతి సంవత్సరం చరిత్ర సబ్జెక్టులో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. ఆయన వద్ద విద్యనభ్యసించిన అనేక మంది విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. తన బోధన ద్వారా కొన్ని వందల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా మార్గనిర్దేశం చేసిన ఘనత శ్రీనివాస్కు దక్కింది.
విద్యార్థులన పరీక్షలకు సిద్ధం చేయడమే కాకుండా, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2009లో స్కూల్ అసిస్టెంట్గా జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకర్ అయిన శ్రీనివాస్.. అనంతరం 2012లో చరిత్ర సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. విద్యా బోధనలో కొత్త ఒరవడిని కొనసాగించిన ఆయన ఇప్పుడు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.