అశ్వారావుపేట, జూన్ 29: చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు ఒక రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్.శ్రీనివాసరావును సంప్రదించాడు. దీంతో మట్టి తరలించేందుకు రైతు వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని బతిమిలాడగా రూ.2 లక్షలకు ఏఈఈ రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అనంతరం సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, అధికారి లంచం అడిగిన విషయాన్ని వివరించాడు. దీంతో వారు పన్నిన పథకం ప్రకారం అశ్వారావుపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో రూ.2 లక్షల నగదును రైతు ఏఈఈ శ్రీనివాసరావుకు అందిస్తుండగా అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారుల బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. శ్రీనివాసరావును కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమేశ్ వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేస్తే బాధితులు తమను సంప్రదించాలని, వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.