ఖమ్మం, డిసెంబర్ 26: ఖమ్మం క్రీడాకారులకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుభవార్త చెప్పారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఎక్కడా లేనివిధంగా ఒక క్రీడా ప్రాంగణంలో మూడు కోర్టులను ఆస్ట్రేలియా టెన్నిస్ కోర్టుల రీతిలో తీర్చిదిద్దారు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని భావించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ఇప్పటికే నగరంలోని పటేల్ స్టేడియానికి సర్వ హంగులనూ అద్దారు. క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ టెన్నిస్ కోర్టులు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.