ఇల్లెందు రూరల్, మార్చి 24 : నూతనంగా ఏర్పాటు కాబోయే ఉపరితల గనిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తిరుగుతున్న దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇల్లెందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొంతమంది దళారులు ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతీ, యువకులను మోసం చేస్తున్నారన్న సమాచారం మా దృష్టికి వచ్చిందన్నారు. సింగరేణి సంస్థ ఉపరితల గనికి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టలేదన్నారు. అటవీ, ఇతర అనుమతులు ఇంకా రావాల్సి ఉందన్నారు.
ఏమైనా ఉద్యోగావకాశాలు (కాంట్రాక్టు పద్దతిలో) ఉంటే ఇల్లెందు ఏరియా సింగరేణి సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుందన్నారు. దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. అలాంటి వారు ఎవరైనా ప్రజలను మభ్యపెడుతుంటే మా దృష్టికి తీసుకురావాలని వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వివరాలను తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. దళారులకు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.