రఘునాథపాలెం, జనవరి 19: సంపూర్ణ అంధత్వ నిర్మూలనూ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వీ వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలోని కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 55 బృందాలను ఏర్పాటు చేసి 100 రోజుల్లో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసేలా కార్యచరణ చేసినట్లు తెలిపారు.
శిబిరం నిర్వహణ విషయమై ముందుగా విస్త్రృత ప్రచారం చేయాలని, ప్రజల సమీకరణ చర్యలు పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. నగర మేయర్ పునకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి డాక్టర్ మాలతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వైద్యాధికారులు డాక్టర్ నాగమణి, డాక్టర్ ప్రేమలత, డాక్టర్ వెంకటనర్సయ్య, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.