భద్రాచలం, ఆగస్టు 1 : భద్రాచలం వద్ద మూడ్రోజులపాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉగ్ర గోదావరి క్రమంగా శాంతిస్తోంది. వరద ప్రభావంతో ఏపీలోని విజయవాడ- ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం వద్ద పూర్తిగా మూసివేశారు. దీంతో భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాలన్నీ భద్రాచలంలోనే నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను భద్రాచలం సబ్కలెక్టర్ మృణాల్ శ్రేష్ట జారీ చేశారు.
అనంతరం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు 54 అడుగులు, ఉదయం 6 గంటలకు 55.10, 8 గంటలకు 55.60, 11 గంటలకు 56.10 అడుగులకు చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు నిలకడగా ఉంది. అనంతరం 3 గంటల నుంచి గోదావరి తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. 3 గంటలకు 55.10 అడుగులు, 4 గంటలకు 55.80, 6 గంటలకు 55.30 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 15,53,130 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, గోదావరి శనివారం రాత్రి 10 గంటల నుంచి 53.70 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది.

బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని ఆర్అండ్బీ రహదారులపై గోదావరి వరద ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి కొత్తగూడెం మార్గంలో మినహా చర్ల, కుక్కునూరు, కూనవరం, వెంకటాపురం రూట్లలో వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ రద్దు చేశారు. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద, భద్రాచలంకు సమీపంలోని కూనవరం రోడ్డు జాతీయ రహదారిపై సారపాక గ్రామం వద్ద బూర్గంపాడు మార్గంపై వరద నీరు పారుతోంది. గోదావరి 45 అడుగులకు తగ్గితేనే రాకపోకలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే భద్రాచలంకు సమీపంలోని యటపాక గ్రామ సచివాలయం సైతం వరద నీటిలో చిక్కుకుంది.
భద్రాచలంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో ఉన్న కరకట్ట ప్రాంతం నుంచి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై పూర్తిగా మట్టికట్ట వేయడంతో భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాలన్నీ భద్రాచలంలోనే నిలిచిపోయాయి. వారంతా వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు. వరద 45 అడుగులకు తగ్గితేనే రహదారిని తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఉదయం వరకు వారు భద్రాచలంలోనే వేచి ఉండాల్సి ఉంది. అలాగే జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఏపీలోని గుండాల, రాయనిపేట, నెల్లిపాక వద్ద ఐదు అడుగుల మేర వరద రోడ్లపై ప్రవహిస్తుండటంతో ఆదివారం మధ్యాహ్నం వరకు జాతీయ రహదారిని తెరిచే అవకాశాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.
గోదావరి వరద ఉధృతి పెరగడంతో వేలేరు- బూర్గంపహాడ్ మధ్యలో ఉన్న కొల్లు ప్రాంతంలో మూడు లారీలు చిక్కుకున్నాయి. లారీలో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లను అక్కడే సహాయక చర్యల్లో ఉన్న బూర్గంపహాడ్ ఉప సర్పంచ్ గుండె వెంకన్న, స్థానికుడు బబ్బురాయుడు అధికారుల సహాయంతో బోటులో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
భద్రాచలం- కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితి, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దుమ్ముగూడెం, ఆగస్టు 1 : మండల కేంద్రంలోని హెడ్లాకుల వద్ద గోదావరి శనివారం 30 అడుగులకు చేరుకున్న అనంతరం కొద్దిసేపు నిలకడగా ఉండి.. క్రమంగా తగ్గుముఖం పట్టింది. తూరుబాక వద్ద భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంగోలు గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి గోదావరి వరద చేరింది. సున్నంబట్టి, ప్రగళ్లపల్లి, పర్ణశాల రామాలయానికి వెళ్లే రహదారుల్లో వరద నీరు నిలిచి ఉంది. సీతా కుటీరం నీట మునిగే ఉంది. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్ణశాల వద్ద వరద ఉధృతిని డీఎల్పీవో సుధీర్కుమార్, సర్పంచ్ ఖాదర్బాబు, సెక్రటరీలతో కలిసి పరిశీలించారు.
దుమ్ముగూడెం, ఆగస్టు 1: ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. దుమ్ముగూడెం మండలంలోని ముంపు బాధితుల కోసం ప్రగళ్లపల్లె రైతువేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో వివేక్రామ్, ఎంపీవో వీరారెడ్డి, ఆర్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చర్ల, ఆగస్టు 1 : గోదావరి, తాలిపేరు నదుల వరద రోడ్లపై నుంచి ప్రవహించడంతో చర్ల మండలంలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల లంక భూముల్లోని పొలాలు నీటమునిగాయి. అధికారులు తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి, వీరాపురం గోదావరి లంకల్లో చికుకుపోయిన వారిని అధికార యంత్రాంగం రెస్యూ బృందం సహాయంతో రక్షించారు.

బూర్గంపహాడ్ : సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపాలెం ప్రధాన రహదారి వద్ద ప్రవహిస్తున్న గోదావరి వరదనీరు

భద్రాచలం : కూనవరం రోడ్డుపై నిలిచిపోయిన లారీలు

బూర్గంపహాడ్ : వరదలో చిక్కుకున్న లారీడ్రైవర్లను బోటు సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న బూర్గంపహాడ్ ఉపసర్పంచ్, స్థానికులు

బూర్గంపహాడ్ : బాధితులతో మాట్లాడుతున్న తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలు

దుమ్ముగూడెం : పర్ణశాల గ్రామస్తులను బోటుపై తరలిస్తున్న దృశ్యం

బూర్గంపహాడ్ : వరద బాధితుల సామగ్రిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్న స్థానిక నాయకులు