భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ ఎఫ్ఎల్సీ, ఈవీఎం గోదాంలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం జిల్లాకు కేటాయించిన 1,588 బ్యాలెట్ యూనిట్లు, 1,424 కంట్రోల్ యూనిట్లు, 1,683 వీవీ ప్యాట్ల మొదటి దశ పరిశీలన గురువారం వరకు పూర్తి చేస్తామని, అనంతరం వాటిని ఈవీఎం గోదాంలో భద్రపరుస్తామన్నారు. ఈవీఎంలను, సీసీ టీవీల పనితీరును ఈసీఐఎల్కు చెందిన సాంకేతిక నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ రంగా ప్రసాద్, సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.