ఖమ్మం సిటీ, మే 23: తెలంగాణ ఆవిర్భావం తర్వాతే క్రీడలకు ప్రాధాన్యత లభిస్తున్నదని రాష్ట్ర క్రీడా సాధికారత కమిటీ (సాట్) చైర్మన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం నగరానికి విచ్చేసి సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డితో కలిసి సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయం, ఐటీ రంగాలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారో క్రీడా రంగానికీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. క్రీడాకారుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారన్నారు. జాతీయస్థాయి పోటీలతోపాటు ఒలింపిక్స్లో రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలోని 617 మండలాల్లో క్రీడా సందడి కనిపిస్తున్నదన్నారు.
ప్రభుత్వ అంచనాలను మించి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని క్రీడా ప్రాంగణాలకు యువతే కేర్ టేకర్స్ అన్నారు. క్రీడాకారులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. క్రీడా రిజర్వేషన్తో కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చన్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు భేషుగ్గా సాగుతున్నాయన్నారు. అనంతరం మండల, జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, కోచ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఓలేటి సాంబమూర్తి, క్రిష్టాఫర్, కృష్ణమూర్తి, గౌస్, మతీన్, నర్సింహమూర్తి, షఫిక్ అహ్మద్ పాల్గొన్నారు.