సారపాక, జూలై 20 : భాష అనేది సమాజానికి ఆత్మ. కళలు, సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, పరిరక్షించడం కోసం అవసరమైన సాధనం. ఒక తెగ తరతరాల మనుగడంతా భాషతోనే ముడిపడి ఉందంటే అది వారి జీవనంలో ఎంతటి ప్రాముఖ్యత కలిగినదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రధానమైన కోయ భాష దేశంలో క్రమంగా అంతరించిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. కానీ తెలంగాణ ప్రభుత్వం కోయ భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆదివాసీలు, గిరిజనుల సామాజిక అభివృద్ధికి పాటుపడుతోంది. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గూడేల్లో ప్రాథమిక పాఠశాలలకు వచ్చే చిన్నారులకు తెలుగు గానీ, ఇతర భాషలు గానీ అర్థం కాకపోవడం, వాటిల్లో ప్రావీణ్యం లేకపోవడం వంటివి వారి విద్యాబోధనకు ప్రతిబంధకంగా ఉన్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం వీరికి ప్రాథమిక విద్యను కోయభాషలో అందించాలని సంకల్పించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. కోయభాషను పరిరక్షిస్తూనే దానికి జీవం పోస్తోంది.
ప్రమాదంలో ఆదివాసీల అస్థిత్వం..
ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ ఆదివాసీల అస్థిత్వం ప్రమాదంలో పడుతోంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులను కాపాడేందుకు ఢిల్లీ సుల్తానులతో వీరోచితంగా పోరాడిన ఆదివాసీలు.. తరువాత క్రమంలో ముస్లిం రాజుల ఊచకోతలకు బలయ్యారు. ఈ క్రమంలో తమను తాము కాపాడుకోవడం కోసం, ఢిల్లీ సేనలను తమను గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఆదివాసీ తెగలు తమ సంప్రదాయాలను, వేష భాషలను వదులుకున్నారు. తరువాత తరాల్లో కోయభాష మాట్లాడే వారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతుండడంతో చివరికి ఆ తెగ తమ అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అవిరళ కృషి జరుపుతోంది.
దేశంలో అంతరిస్తున్న ఆదివాసీ భాషలు..
దేశంలో 705 గిరిజన తెగలుండగా వీరు ప్రాంతీయ భాషలతోపాటు 100కు పైగా గిరిజన భాషలు, 600కు పైగా మాండలికాలు మాట్లాడుతున్నారు. వడోఢరలో ఉన్న భాషా రీసెర్చ్ సెంటర్ అండ్ పబ్లికేషన్ సెంటర్ అధ్యయనాల ప్రకారం.. 1961 నాటికే దేశంలో 220 ఆదివాసీ భాషలు అంతరించిపోయాయి. వచ్చే 50 ఏళ్లలో మరో 150 ఆదివాసీ భాషలు అంతర్థానానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో కోయభాష లేనప్పటికీ రోజురోజుకూ కోయ భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఈ భాషను దేశవ్యాప్తంగా సుమారు 13,48,423 మంది మాట్లాడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల్లో ఆదివాసీలందరూ మాట్లాడుతారు. తెలంగాణలో పరిశీలిస్తే.. భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపహాడ్, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో నూటికి నూరు శాతం మంది, ఇల్లెందు, కొత్తగూడెం, ఏన్కూరు, ఏటూరు నాగారం, ములుగు, మహబూబాబాద్, పాకల కొత్తగూడ మండలాల్లో నూటికి 80 శాతం మంది ఆదివాసీలు కోయభాషను మాట్లాడుతున్నారు.
తెలంగాణలోనే ఆదివాసీలకు గుర్తింపు..
ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఆదివాసీల ఆరాధ్యదైవమైన కుమ్రం భీం జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో రూ.5 కోట్లతో ఆదివాసీ భవన్ను నిర్మించారు. ఎ న్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన గూడేలను పంచాయతీలుగా చేశారు. వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. పోడు పట్టా లు అందించి వారు సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులు కల్పించారు. గిరివికాస్ పథకం ద్వారా సబ్సిడీపై బోర్లు, మోటర్లు అందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలనూ వర్తింపజేస్తున్నారు. మొత్తంగా ఆధునిక మనుగడకు బాటలు వేస్తున్నా రు. భద్రాచలం ఐటీడీఏలోనూ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రై నింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఆదివాసీల సంస్కృతిని తెలియజేస్తున్నారు.
ఆదివాసీలకు గుర్తింపునివ్వడం గొప్ప విషయం..
తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు గుర్తింపునివ్వడం గొప్ప విషయం. అంతరించిపోతున్న కోయ భాషకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింపునివ్వాలి. ఆదివాసీలు సైతం తమ మాతృభాషలోనే మాట్లాడాలి. ఇప్పటికే విద్యార్థులకు, యువతకు మా వంతుగా అవగాహన కల్పిస్తున్నాం. గిరిజన ఆదివాసీల సంస్కృతీ సాంప్రదాయాలపై పరిశోధన చేస్తున్నాం.
-పాయం రాజేంద్రప్రసాద్, ఆదివాసీ సాంస్కృతిక పరిశోధన వేత్త, భద్రాచలం