కొత్తగూడెం అర్బన్, జనవరి 8 : కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలూ కృషిచేస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల బాగోగులు, వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అందులో భాగంగానే భవన నిర్మాణ రంగ కార్మికులకు గతంలో ఇస్తున్న ఎక్స్గ్రేషియా కంటే ఎక్కువగానే అందిస్తూ వారి మన్ననలు పొందుతోంది. వారి సంక్షేమం కోసం ఆర్థికంగానూ తోడ్పాటునిస్తోంది.
2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల వరకు 9 నెలల కాలంలో భవన రంగ నిర్మాణరంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 2,756 మంది కార్మికులకు రూ.15.23కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. కార్మిక కుటుంబాల్లోని మహిళలకు మ్యారేజ్ స్కీం ద్వారా 858 మందికి రూ.2.57కోట్లు, ప్రసూతి సహాయం కింద రూ.4.24 కోట్లు, సహజమరణం పొందిన 465 మంది కుటుంబాలకు రూ.6.04 కోట్లు, ప్రమాదవశాత్తూ మరిణించిన 39 మంది కార్మికుల కుటుంబాలకు రూ.2.45 కోట్లు, శాశ్వత అంగవైకల్యం పొందిన ముగ్గురికి రూ.6 లక్షలను ప్రభుత్వం జమ చేసింది.
భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకొని గుర్తింపు పొందినవారికే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీలు, ఎలక్ట్రిషీయన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు, రాడ్ బెండింగ్ కార్మికులు, ఇతర కూలీలు దీనికి అర్హులు. నెలకు ఒక్క రూపాయి, సంవత్సరానికి రూ.12 చొప్పుల ఐదేళ్లకు రూ.60, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.50 కలిపి మొత్తం రూ.110 చలానా తీసి కార్మికశాఖలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 86,898 మంది కార్మికులకు కార్మిక శాఖ గుర్తింపుకార్డులను మంజూరు చేసింది. ఇందులో మహిళలు 36,771 మంది, పురుషులు 50,127 మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం లేబర్ కార్డులు పంపిణీ చేసింది.