మామిళ్లగూడెం, జనవరి 23 : ట్రాన్స్ఫార్మర్స్ ఫెల్యూర్స్ తగ్గించి వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం నగరంలోని డీపీఆర్సీ భవనంలో విద్యుత్శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్స్ ఫెల్యూర్ తగ్గిస్తే సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమావేశంలో డైరెక్టర్లు సంధ్యారాణి, తిరుపతిరెడ్డి, మోహన్రెడ్డి, ఎస్ఈ సురేందర్, డీఈటీ బాబూరావు, డీఈఈలు, ఏడీఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలను వినియోగదారులకు మరింతగా చేరువ చేస్తామన్నారు. జిల్లాలో మీటర్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి వారంరోజుల్లో కొత్త మీటర్లు మంజూరు చేస్తామని తెలిపారు. సంస్థలో దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను పార్లమెంట్ ఎన్నికల తరువాత బదిలీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముందుగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104, టీఆర్ఎస్కేయూ విద్యుత్ ఉద్యోగుల సంఘం, ఇంజినీర్స్ అసోసియేషన్స్ తమ సమస్యల పట్ల సీఎండీకి వినతిపత్రాలు అందించారు.