భద్రాచలం, మార్చి 19 : భద్రాచలం పట్టణంలో పుష్కర తీర్థ శోభాయాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి పెళ్లి పనులకు ఈ నెల 7న శ్రీకారం చుట్టారు. ఉత్తరద్వార దర్శనం వద్ద పసుపు కొమ్ములను దంచుట, కల్యాణ తలంబ్రాలు కలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనుండడంతో అందుకు అవసరమైన పుష్కర పట్టాభిషేక తీర్థ సమీకరణకు అర్చకులు, ఆస్థాన స్థానాచార్యులను నాలుగు దిక్కులకు పంపించారు. వీరు సముద్ర, నదీ జలాలను తీసుకొని ఆదివారం భద్రాచలం చేరుకోగా వారికి బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఆల య అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. తీర్థ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీదేవిని ఆవాహన చేసి లక్ష్మి అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు. అక్కడ నుంచి కోలాటం, మంగళ వాద్యా లు, వేద మంత్రాల నడుమ శోభాయాత్రగా పుష్కర కలశాలను తాతాగుడి సెంటర్ మీదుగా రాజవీధి గుండా తీసుకొచ్చి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు.
అనంతరం పుష్కర కలశాలను ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో భద్రపరిచారు. మరల ఆవాహన, ప్రతిష్ఠాపనలు, ప్రత్యేక పూజలు జరిపారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంలో వినియోగించాల్సిన ద్రవ్యాములను కూడా సేకరించారు. 100 కిలోల ముత్యాలు కొనుగోలు చేశారు. 22న ఉగాది పర్వదినం రోజున ఆలయంలో నూతన పంచాంగ శ్రవణం జరుపనున్నారు. స్వామివారి, అమ్మవారి ఆదాయ, వ్యయాలను ఆస్థాన స్థానాచార్యులు వివరించనున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఏఈవో శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్రాజు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.