ఖమ్మం రూరల్, మే 5: ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియలో తప్పిదాలు జరుగకుండా జాగ్రత్త పడాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం, వీవీ ప్యాట్ల కమీషనింగ్ పక్రియను ఆదివారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఖమ్మం అసెంబ్లీ సగ్మెంట్లో 36 టేబుళ్లు, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో 29 టేబుళ్లు ఏర్పాటు చేసి, కమీషనింగ్ ప్రక్రియ చేపట్టి సోమవారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.