అశ్వారావుపేట/ దమ్మపేట రూరల్, మార్చి 9: పెరిగిన ఆయిల్పాం సాగు విస్తరణను దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యాలను పెంచుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.120 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు. ఈ మేరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీలో కొత్తగా నిర్మించే బాయిలర్ స్థలాన్ని, అప్పారావుపేట ఫ్యాక్టరీని గురువారం ఆయన పరిశీలించారు.
సివిల్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు రూ.90 కోట్లతో అప్పారావుపేట ఫ్యాక్టరీని 60 నుంచి 90 మెట్రిక్ టన్నులు, రూ.30 కోట్లతో అశ్వారావుపేట ఫ్యాక్టరీని 30 నుంచి 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యాలకు విస్తరిస్తున్నామని వివరించారు. వచ్చే రెండేళ్లలో ఇందుకు అవసరమైన పంట దిగుబడులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండేళ్లలో 35 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు కొత్త ప్లాంటేషన్ పూర్తయిందని, వచ్చే ఏడాది నుంచి దిగుబడులు అందుతాయని అన్నారు. అశ్వారావుపేటలో నిర్మించే కొత్త బాయిలర్ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని, బాయిలర్ పనుల కోసం త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 24 నాటికి బాయిలర్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో పెరిగిన ప్లాంటేషన్ల నుంచి వచ్చే దిగుబడులకు అనుగుణంగా కొత్త ఫ్యాక్టరీలను నిర్మిస్తామని, వచ్చే ఏడాది సిద్దిపేటలో కొత్త ఆయిల్పాం ఫ్యాక్టరీని నిర్మించనున్నామని వివరించారు. వేంసూరు మండలం కల్లూరిగూడెంలోనూ మరో ఫ్యాక్టరీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. భూములుండి సరైన రికార్డులు లేని రైతులకు సబ్సిడీ మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. జీఎం సుధాకర్రెడ్డి, పీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, డీవో బాలకృష్ణ, దమ్మపేట మేనేజర్ కల్యాణ్ పాల్గొన్నారు.