మామిళ్లగూడెం, ఫిబ్రవరి 7: సంప్రదాయ కులవృత్తులను లాభదాయకంగా మార్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం అజయ్కుమార్ పేర్కొన్నారు. కులవృత్తి, చేతివృత్తి కళాకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న ఈ పథకానికి అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఖమ్మం టీటీడీసీలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మంగళి, రజక, వడ్డెర, ఔసలి, కంసాలి, దర్జీ వంటి చేతి వృత్తులపై ఆధారపడి జీవించేవారంతా ఈ పథకంలో ఆర్థికసాయానికి అర్హులవుతారని వివరించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలతో సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి మాట్లాడుతూ.. ఈ పథకం కింద లబ్ధిదారులకు మొదటి విడతలో రూ.లక్ష రుణం మంజూరు చేస్తామని, నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించిన వారికి మళ్లీ రూ.2 లక్షల రుణం అందిస్తామని తెలిపారు. అనంతరం, బాలానగర్ ఎంఎస్ఎంఈ డీఎఫ్వో శివకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కే.శివరామప్రసాద్ తదితరులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన ద్వారా అధికారులు, దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, కార్మికశాఖ డీసీ వెంగమ్మ, మున్సిపల్ అధికారి సుజాత, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 400 మంది వృత్తిదారులు హాజరయ్యారు.