ఖమ్మం, సెప్టెంబర్ 05 : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నిరుద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఐక్యంగా ఎదురించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు, ప్రకటనలు చేసి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువత ఆశలను ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు. గురుకులాల్లో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లను మినహాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
వైరా టౌన్ : బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కట్టా కృష్ణార్జున రావు, వెంకటేశ్వరరావు, వనమా విశ్వేశ్వరరావు, మద్దెల రవి, ఏదునూరి శ్రీను, నూకల వాసు, వదినేపల్లి చక్రవర్తి, షేక్ సైదా, సింగవరపు నరేష్, వేముల శివకృష్ణ, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, తడికమల శ్రీనివాసరావు, కట్ట శేఖర్ బాబు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్