భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ బూర్గంపహాడ్, ఆగస్టు 3: ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదల కారణంగా భద్రాద్రి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృంద ప్రతినిధులు బుధవారం జిల్లాలో పర్యటించారు. బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలకు దెబ్బతిన్న పంటలను, ఇతర నష్టాలను స్వయంగా పరిశీలించారు. రైతులతోనూ మాట్లాడి నష్ట తీవ్రత గురించి తెలుసుకున్నారు. జాతీయ విపత్తులు, హోంమంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిప్యూటీ సెక్రటరీ అనీల్ గైరోల, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ రమేశ్కుమార్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ భయాపాండే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సీనియర్ సైంటిస్టు శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, ఐఈఎస్ రీజినల్ అధికారి ఎస్కే కుష్వాలతో కూడిన కేంద్ర బృందం అధికారులు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం రాత్రి ఐటీసీ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు.
ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర పదర్శనను గురువారం ఉదయం పరిశీలించారు. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, పంటలు, పశుసంపద, మిషన్ భగీరథ పథకాలు, ఇరిగేషన్ చెక్డ్యాముల గురించి భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక వివరించారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు బూర్గంపహాడ్ సమీపంలో కోతకు గురైన ప్రధాన రహదారిని పరిశీలించారు. ముంపు గ్రామాల్లో వరి 260 ఎకరాలు, పత్తి 633 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ మధుసూధన్రాజు, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్రెడ్డి, భీమ్లా, మంగ్యా, అభిమన్యుడు, మరియన్న, పురంధర్, తిరుమలేశ్, నళిని, శంకర్ పాల్గొన్నారు.