కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 18: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఓ కమాండర్ స్థాయి అధికారిని దారుణంగా హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్స్టేషన్ పరిధి అటవీప్రాంతంలోని సీఏఎఫ్ క్యాంప్నకు 200 మీటర్ల దూరంలో తన సిబ్బందితో కలిసి వంట చెరుకు సేకరిస్తున్నాడు. మావోయిస్టులు అప్పటికే సాయుధంగా వచ్చి కాపుగాసి కమాండర్ తిజౌరామ్ భూర్యను అపహరించారు. గొడ్డలితో దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి ఉడాయించారు. జవాన్లు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న భూర్యను విగత జీవిగా గుర్తించారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.
కమాండర్ హత్యను సీరియస్గా తీసుకున్న అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా జరిగిన స్థలానికి భారీగా భద్రతా దళాలను పంపించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హత్యకు గురైన కమాండర్ స్వగ్రామం నారాయణ్పూర్ జిల్లాలోని భానుప్రతాపపురం అని తెలుస్తున్నది. మరోవైపు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్శర్మ పిలుపు మేరకు తాజాగా మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ షరతులతో కూడిన చర్చలకు అంగీకరిస్తున్నట్లు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మావోయిస్టులు ఓ కమాండర్ను పొట్టన పెట్టుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచిచూడాల్సిందే.