ఖమ్మం, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఛీప్ పాలిట్రిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడచూసినా నిరసనలు, నినాదాలతో మండల కేంద్రాలు హోరెత్తాయి. రహదారులపై మండుటెండలో కూర్చొని బీజేపీ తీరును, ఈడీ అధికారుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఒక్కటికాదు.. రెండుకాదు పదేండ్లుగా బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు.
ఖమ్మం నగరంలో సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు షేక్ షకీనాతోపాటు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మధిర మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి రహదారిపై నిరసనకు దిగారు. కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. మండల పార్టీ ఆధ్వర్యంలో చంద్రుగొండలో భారీ ధర్నా జరిగింది. కండ్లకు నల్లకండ్లద్దాలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
వైరా పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, పీఎం నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తుపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు కోనేరు సత్యనారయణ పాల్గొన్నారు. ఇల్లెందు, టేకులపల్లి, సారపాక, ఖమ్మం జిల్లాకేంద్రంలో సైతం బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.