ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేయకపోయినా వారి అనుచరులు, పార్టీ నేతలు అభ్యర్థుల తరఫున మంగళవారం పలుచోట్ల నామినేషన్లు వేశారు. ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ తరఫున నగర మేయర్ పునుకొల్లు నీరజ, రఘునాథపాలెం జడ్పీటీసీ బానోత్ ప్రియాంక, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదర్శ సురభికి అందజేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించడానికి ముందు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు ఇచ్చి నామినేషన్ డిపాజిట్ను పార్టీ నాయకుల ద్వారా ఎన్నికల అధికారికి అందజేశారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగమణి, స్వతంత్ర అభ్యర్థులుగా రమావజ్జుల రవికుమార్, పాల్వంచ రామారావులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
పాలేరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నున్నా రవికుమార్, ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా ఇస్లావత్ రవీందర్, తెలగమాల రాంబాబు, గుగులోత్ సురేశ్ నామినేషన్లు వేశారు. వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గుగులోత్ తావుర్యా, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పాతకోటి అరుణ నామినేషన్ దాఖలు చేశారు. వారి నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గ ఆర్వోలకు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా మాలోత్ శ్రీనివాస్, కల్తి లెనిన్, జనసేన పార్టీ అభ్యర్థిగా లక్కినేని సురేందర్, బీజేపీ అభ్యర్థిగా రమణారెడ్డి సూరిరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా మర్మం తిరుపతమ్మ, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా రవ్వా భద్రమ్మ, పినపాక నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఈసం కృష్ణ, పూనెం రంగయ్య, ఇల్లెందు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య, బీజేపీ అభ్యర్థిగా దరావత్ రవీంద్రనాయక్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా లకావత్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నుంచి రవి గుగులోత్, నామోదర్నాయక్ అంగోత్ నామినేషన్లు వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు అందుకు సమాయత్తమవుతున్నారు.