కారేపల్లి, మే 28 : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్ఞా) పండుగను కారేపల్లి మండల వ్యాప్తంగా గురువారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానం వద్దకు ముస్లింలు భారీ సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను, దాని విశిష్టతను భక్తులకు వివరించారు. పవిత్ర ఖురాన్ బోధనలను ప్రతి ఒక్కరూ తూ.చా. తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతియుతంగా జీవించాలన్నారు. ప్రార్థనల అనంతరం చిన్న, పెద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.