– తెలంగాణ రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పున్నంచంద్
బూర్గంపహాడ్, ఆగస్టు 27 : వయసు పైబడి కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోక ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే పండుటాకుల (వృద్ధులు)పై ‘చేయూత’ విషయంలో ప్రభుత్వానికి వివక్ష ఎందుకని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.పున్నంచంద్ ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ చేయూత పథకంలో పింఛనుకై దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4వేలు ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాక పింఛన్లకు అన్నివర్గాలను దరఖాస్తు చేసుకోమని వృద్ధులను మాత్రం ఈ పథకానికి దూరం చేయడం తగదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి చేయూత పథకంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి వృద్ధులు నాలుగు లక్షల మంది ఉన్నారన్న అంచనాతో వారిని పక్కనపెట్టడం సమంజసం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు.
నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో ఆశావహుల జాబితా పెరిగిందని, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఫించన్ దరఖాస్తుల ఫారాల్లో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, పైలేరియా బాధితుల వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారని…కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న 30వేల వరకు ఉన్న వృద్ధులను చేయూత పథకానికి దూరం చేయడంపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా వృద్ధులకు చేయూత పథకంలో కొత్తగా అవకాశం కల్పించి తాజాగా మంజూరు చేసే లబ్దిదారులతో పాటు వారికిఅవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.