ముప్కాల్/మాక్లూర్, మార్చి 9: రెండు రోజుల క్రితం గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం వచ్చి ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందిన ఘటన మరువకముందే మరో యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెండోరా మండలంలో శనివారం చోటుచేసుకుంది. మాక్లూర్ మండలంలోని గుత్ప గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మక్కుల్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం పోచంపాడ్లోని గోదావరి నదికి వచ్చాడు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు మక్కుల్ రెడ్డితోపాటు ఆయన కొడుకు మక్కల మహేశ్ (25), మేనల్లుడు దండుగుల శ్రీనివాస్ నదిలోకి దిగారు. ఇంతలో నీటి ప్రవాహం ఉధృతం కావడంతో కొడుకు, మేనల్లుడు కొట్టుకుపోసాగారు. దీనిని గమనించిన మక్కల్ రెడ్డి కొడుకు, అల్లుడిని కాపాడే ప్రయత్నం చేయగా దండుగుల శ్రీనివాస్ బయటపడగా.. మక్కల మహేశ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో గాలించి.. మహేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. మహేశ్ మృతదేహమై రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మహేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జాతరకు వచ్చి మరొకరు..
డొంకేశ్వర్ మండలం ఉమ్మెడ శివారులోని గోదావరిలో ప్రమాదవశాత్తు మాధవ్ (33)అనే యువకుడు నీటమునిగి మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లా కనిగిరి మండలానికి చెందిన మాధవ్ నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం వట్టోలి గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి ఉమ్మెడ వద్ద జరుగుతున్న జాతరకు వచ్చాడు. సరదాగా స్నానం చేసేందుకు స్నేహితులతో కలిసి నదిలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో బయటికి తీయించి పంచనామా నిర్వహించారు.