ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 5 : విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నూతన కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తూనే విద్యార్థులు నైతిక విలువలు పాటించే విధంగా కృషి చేయాలన్నారు. దేశంలోని సంస్కృతీ సాంప్రదాయాలకు భిన్నంగా పాశ్చాత్య ధోరణి కనిపిస్తున్నదని, చెడుకు దూరంగా ఉంటూ.. సమాజంలో విలువలతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో తోటి వారితో మంచిగా మెలిగేలా ఉండాలని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
డీఈవో సోమశేఖరశర్మ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను కొనియాడారు. కరోనా తర్వాత విద్యా అభ్యాసనంలో చాలా దేశాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, ఇందులో భాగంగా మన ఉపాధ్యాయులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పిస్తున్నారన్నారు. పదో తరగతిలో నూరు శాతం ఫలితాల సాధనకు లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్నారు. అనంతరం జిల్లాస్థ్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 28 మంది టీచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్, ఏడీ వెంకటేశ్వరాచారి, నారాయణ, సెక్టోరల్ అధికారులు రవికుమార్, భూలక్ష్మి, రాజశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల పురస్కారం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులను హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఇతర శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా అందించారు. ఉత్తమ అవార్డులు పొందిన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలం రాపల్లె యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆవుల రాంబాబు, భద్రాచలం పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలోని ఎస్జీకే ఎయిడెడ్ పాఠశాల హెచ్ఎం వేంపాటి ఉషారాణి, కొత్తగూడెం కూలీలైన్ జీహెచ్ఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు గుంటి రమాదేవి, యూనివర్శిటీల విభాగంలో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డీ. సురేశ్బాబు, ఎ.రమాసత్యవతి, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు టి. అరుణకుమారి, ఎం. పూర్ణచందర్రావు ఉన్నారు. అవార్డు పొందిన వారిని ఆయా కళాశాలలు, పాఠశాలల సిబ్బంది అభినందించారు.