మామిళ్లగూడెం, మే 19: పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్మేళాకు విశేష స్పందన లభిస్తోందని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించే లక్ష్యంగా నిర్వహించే మేగా జాబ్మేళా వివరాలు వెల్లడించేందుకు పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే జాబ్మేళాకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం సమీప పోలీసుస్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. విద్యార్హతలకు అనుగుణంగా 140 కంపెనీల్లో 8,150 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అన్నారు. సుమారు15 వేలమంది పైగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగార్థులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పదో తరగతి దగ్గర నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వారికి కూడా ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సాఫ్ట్, కమ్యూనికేషన్ సిల్స్ ఉన్న వారికి అధిక వేతనాలు ఆఫర్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రావడం ఖమ్మం జిల్లాలో ఇదే ప్రథమమని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే కాకుండా నేరుగా హాజరైన వారు కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని యువత కూడా ఈ జాబ్మేళాలో పాల్గొనవచ్చునని అన్నారు. అనేక కంపెనీలు వస్తున్నందున ఒక్కో అభ్యర్థి కనీసం 10 రెజ్యూమేలు ఫైల్స్ తయారు చేసుకొని రావాలని సూచించారు. ఏడీసీపీ సుభాశ్చంద్రబోస్, ఏసీపీలు గణేశ్, బస్వారెడ్డి, రామోజీ రమేశ్, రెహమాన్, ప్రసన్నకుమార్, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, సీఐ తుమ్మ గోపి తదితరులు పాల్గొన్నారు.