చుంచుపల్లి, మే 6: వేలకు వేలు పెట్టుబడులు.. మధ్య మధ్యలో ప్రకృతి వైపరీత్యా లు.. అరకొరగా చేతికొచ్చే పం ట.. అంతా కష్టపడి మార్కెట్లో పండించిన పంటకు మార్కెట్లో రేటు ఉంటుందో లేదో తెలియదు. ఇలా వాణిజ్య పంటలు సాగు ప్రస్తుతం జూదమైంది. ఇలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయ పంటల సాగే శ్రేయస్కరమని రైతులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమూ ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. దీనిలో భాగం గా ఉద్యాన పంట అయిన ఆయిల్పాం సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలను పంపిణీ చేస్తున్నది. భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం వేలాది ఎకరాల్లో రైతులు ఆయిల్పాం సాగు చేస్తున్నారు.
డ్రిప్ పాస్ పుస్తకం కలిగి ఉండి తోటలో బోర్, కరెంటు వసతి ఉన్న రైతు ఆయిల్పాం రాయితీలు పొందవచ్చు. మొక్క ల కోసం ప్రతి రైతు ఎకరానికి రూ. 1,140 చొప్పున డీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యానశాఖ ఎకరానికి 57 చొప్పున ఆయిల్పాం మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తుంది. మొక్కలు నాటిన నాలుగో సంవత్సరంలో పంట దిగుబడి వస్తుంది. మొదటి సంవత్సరం ఎకరానికి రాయితీ రూ.11,600, రెండో సంవత్సరం ఎరువులు, అంతర పంటలకు కలిపి రూ.4,200, మూడో సంవత్సరం రూ.4,200, నాలుగో సంవత్సరం రూ.4200తో పాటు బిందుసేద్య పరికరాలకు రూ.22,518 ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఇలా నాలుగు సంవత్సరాలకు కలిపి ప్రభుత్వం రైతులకు రూ.50,918 రాయితీ ఇస్తున్నది.
ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులు మొదటి నాలుగు సంవత్సరాల్లో అంతరపంటలుగా అరటి, బొప్పాయి, జామ, మల్బరీ, మొక్కజొన్న, కూరగాయలు, వేరుశనగ, మినుములు, కందులు, పెసర, నువ్వులు, పొద్దు తిరుగుడు, మిరప, పత్తి సాగు చేపట్టి అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఏడు సంవత్సరాల తర్వాత కోకో, వక్క, జాజికాయ వంటి విలువైన పంటలు,
సాగు చేయవచ్చు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రైతులు 55,301 ఎకారాల విస్తీర్ణంలో ఆయిల్పాం సాగు చేస్తున్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో మరో 20,100 ఎకరాల్లో సాగును విస్తరిం చేందుకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళి కలు అమలు చేస్తున్నారు. గెలల ధర ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు రూ.14,205 పలుకుతున్నది. రైతులు గెలలను పామాయిల్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు ప్రభుత్వమే చార్జీలు చెల్లించింది.
సాధారణ పంటలతోపాటు వాణిజ్య పంటల సాగుకు నీటి వసతి పుష్కలంగా ఉండాలి. సేద్యం పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలను తీసుకురావాలి. కూలి చెల్లింపులు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితులను రైతులు అధిగమించడానికి ప్రభుత్వం ఆయిల్పాం రైతులకు రాయితీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నది. తక్కువ నీటి వనరులతో మంచి దిగుబడి సాధించే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నది. గెలలను పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వమే రైతులకు రవాణా చార్జీలు అందిస్తున్నది. గెలలను తీసుకొచ్చిన దూరాన్ని బట్టి సొమ్ము అందజేస్తున్నది.