బూర్గంపహాడ్, జూన్ 30: కంటైనర్లో తరలిస్తున్న కిలోలకొద్దీ గంజాయిని తెలంగాణ ఈగల్ ఫోర్స్, జిల్లా పోలీసులు పట్టుకున్న ఘటన సారపాక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈగల్ ఫోర్స్ ఆర్ఎన్సీసీ, జిల్లా పోలీసుల కథనం ప్రకాం. ఒడిశా అల్లూరికోట అటవీ ప్రాంతం ఒడిశా-మల్కాన్గిరి సిందూర్పల్లికి చెందిన సహదేవ్ హంటల్ గంజాయిని సేకరించి, కూలీల బృందాన్ని నియమించుకుని వారి సహాయంతో ఏపీలోని తులసిపాకకు తరలించాడు. దీనిని సూరత్కు చెందిన మహ్మద్ సైఫ్, ఫిరోజ్ బాయ్లకు చెందిన కంటైనర్ లారీలో రహస్య మరను ఏర్పాటు చేసి అందులోకి గంజాయి ప్యాకెట్లను పేర్చారు.
అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు తరలిస్తుండగా సారపాక సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా తెలంగాణ ఈగల్ టీం, జిల్లా పోలీసులు లారీని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక మరను గుర్తించి, తనిఖీలు చేపట్టగా అందులో 525 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని తరలిస్తున్న కంటైనర్ లారీకి ముందు ఓ బైక్ ఎస్కార్ట్గా రావడాన్ని గమనించిన పోలీసులు లారీతోపాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలో గంజాయిని సేకరించి ఏపీ రాష్ట్రంలోని తులసిపాక, మోతుగూడెం, భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్కు తరలిస్తుండగా పట్టుబడిందని, దీని విలువ రూ.2.65 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న కంటైనర్ లారీ, పల్సర్ బైక్తోపాటు సిందూర్పల్లికి చెందిన సహదేవ్ హంటల్, ఎస్కార్ట్గా ఉన్న మారేడుమిల్లికి చెందిన డోగ్రి త్రినాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజాపూర్కు చెందిన కంటైనర్ లారీ డ్రైవర్ కులదీప్ శర్మతోపాటు ఓ బాలుడిని అరెస్టు చేశామని, మహ్మద్ సైఫ్, ఫిరోజ్బాయ్, రాజా మిశ్రా, మహ్మద్ ఇమ్రాన్లు తప్పించుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,570 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.