సుజాతనగర్లో విత్తన భాండాగారం
రైతు మన్నేపల్లి రవి వినూత్న ఆలోచన
రెండు దశాబ్దాలుగా విత్తనాలపై పరిశోధన
లక్షలాది ఎకరాలకు సరిపడా సీడ్స్ సిద్ధం
కొత్తగూడెం, నవంబర్ 11 : ఇప్పుడు రైతుల చూపు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లింది. ఏ రైతును పలకరించినా.. ఏ నేలల్లో ఎలాంటి పంటలు వేయాలి. ఏ విత్తనాలు నాటితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తున్నది.. పంటల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నీటి వసతి ఉన్నచోట ఎలాంటి పంటలు వేయాలి..? నీటివసతి లేకుంటే ఏం సాగు చేయాలనేది చర్చ నడుస్తున్నది. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. కర్షకులందరూ వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండిస్తే.. మరి విత్తనాలు ఎవరు సిద్ధం చేయాలి.? ఏ పంటకైనా విత్తనమే ముఖ్యం కదా..! విత్తనాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో పరిశోధన చేయాలి. లేదంటే దిగుబడి రాక.. పెట్టుబడి వృథా అవుతుంది. తెలియని విత్తన బ్రాండ్లు, తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కొనుగోలు చేసి నష్టపోయిన రైతులెందరినో చూశాం. వారి ఆవేదనను విన్నాం. ఇలాంటి పరిస్థితి రాకూడదని, సాగు చేసే ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఆలోచనతో సుజాతనగర్కు చెందిన మన్నేపల్లి రవి రంగంలోకి దిగారు. ‘స్వయంగా విత్తనాలు తయారు చేసి మరికొందరికి నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. వందలాది రకాల విత్తనాలను తయారు చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా వీటిపైనే పరిశోధన చేస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మనం ఎక్కడికి వెళ్లినా వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించే రైతులను మాత్రమే మనం చూస్తుంటాం. అందరూ పంటలే పండిస్తే మరి విత్తనాలు సిద్ధం చేసేదెవరు..? పంట పండించాలంటే ముందు విత్తనాలు ముఖ్యం కదా.. మనకు తెలియని విత్తన బ్రాండ్లు కొని, తక్కువకు వస్తున్నాయి కదా అని వాటిని నాటి, పొరుగు రైతు ఇవే విత్తనాలు వాడుతున్నాడు కదా.. మనం కూడా అవే విత్తనాలు వాడుదాం.. అని నష్టపోయిన వారిని ఎంతో మందిని చూసుంటాం.. కానీ ‘స్వయంగా విత్తనాలు తయారు చేసి మరికొందరికి నాణ్యమైన విత్తనాలు అందిస్తే ఎలా ఉంటుంది..’ అనే ఆలోచన నుంచి సుజాతనగర్కు చెందిన మన్నేపల్లి రవి తన వ్యవసాయ క్షేత్రంలో విత్తన పరిశోధన చేస్తున్నారు. వందలాది రకాల విత్తనాలను తయారు చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా వీటిపైనే పరిశోధన చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
20 రాష్ర్టాలకు సరఫరా చేసేలా
ఉన్నత చదువులు చదివిన రవి సాగు క్షేత్రంలో నిత్య పరిశోధకుడిగా ఉంటారు. ‘ఎక్కడి నుంచో విత్తనాలు తెచ్చుకోవడం కాదు. మన దగ్గరే విత్తనాలు తయారు చేసుకోవాలి. మన బ్రాండ్ మనకు ఉండాలి..’ అనే సంకల్పంతో రైతుల కోసం విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 రాష్ర్టాలకు సరాఫరా చేసేలా ఆయన విత్తనాలు సిద్ధం చేశారు. ఈ విత్తనాలు సుమారు మూడు లక్షల ఎకరాలకు సరిపోతాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు ఆయన 70 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. ఇతర దేశాల్లోనూ తెలంగాణ బ్రాండ్ ఉండాలన్న లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు. ఈ క్షేత్రంలో సిద్ధం చేసిన విత్తనాలు డీఎస్ఐఆర్ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
నేలనుబట్టి విత్తనాల గ్రేడింగ్..
విత్తన ప్రయోగశాలలో తయారు చేసిన విత్తనాలను వాటిని కోరే రైతులకు చెందిన నేల స్వభావాన్ని బట్టి సరఫరా చేస్తున్నారు. 10 మంది సైంటిస్ట్లు నిరంతరం పరిశోధనా క్షేత్రంలో పనిచేస్తుంటారు. ఒకే రకం విత్తనాన్ని నేల స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు.. అనే అంశంపై నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. విత్తనాలు రాబట్టేందుకు ముందు ఆయా పంటలను సాగు చేస్తున్నారు. పురుగులు బెడద లేకుండా మల్చింగ్ పద్ధతిలో దిగుబడి సాధిస్తున్నారు. వాటిలో మేలైన వాటిని విత్తనాలుగా భద్రపరుస్తున్నారు. అవసరమైన వారికి విత్తన రూపంలో పంపిస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో విత్తనాలను ఇక్కడ నిల్వ చేస్తున్నారు. అవసరమైతే వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి పరిశోధన చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి రైతులు వస్తున్నారు..
జిల్లాలో ఎక్కువ మంది రైతులు కూరగాయలు, పుచ్చ, చిక్కుడు, బెండ, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలు సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వివిధ రకాల మిర్చి పంటలు సాగు చేస్తున్నా. అధిక దిగుబడి వచ్చే పంటలను విత్తనాలకు ఉపయోగపడేలా జాగ్రత్త వహిస్తున్నాం. ఈ తోటలను చూడడానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచీ రైతులు వస్తున్నారు. కోటి టన్నుల విత్తనాలు తయారు చేయాలనేది నా లక్ష్యం. అన్ని రాష్ర్టాలకు తెలంగాణ బ్రాండ్ వెళ్లాలని కోరుకుంటున్నా.