లబ్ధిదారుల ఇళ్లకెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన అజయ్
బైకుపై వెళ్లి చెక్కుతోపాటు చీర, పసుపు, కుంకుమ అందజేత
నగరంలో 39 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు
ఖమ్మం, ఆగస్టు 11: ఆడ పిల్ల వివాహం జరిగిన ఇంటికి మేన మామలా వచ్చారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. వస్తూ వస్తూ ఒట్టి చేతులతో ఏమీ రాలేదు. లక్షా నూట పదహారు రూపాయల కల్యాణలక్ష్మి చెక్కు, చీర, పసుపు, కుంకుమ వెంట తెచ్చారు. ఆ యువతికి ఆ చెక్కు అందించారు. చీర, పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు. దీంతో ఆ ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా సంతోషించారు. మేనమామలా వచ్చిన అజయ్కి హారతిపట్టారు. కృతజ్ఞత తెలిపారు. ఇదీ.. ఖమ్మం నగరంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన తీరు. ఖమ్మంలోని తన ఇంటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బయలు దేరిన మంత్రి అజయ్.. 39 మంది లబ్ధిదారుల ఇంటికెళ్లి చెక్కులు అందజేశారు.
పేదల పెద్దన్న కేసీఆర్: మంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో బుధవారం లబ్ధిదారుల వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుతోపాటు చీర, పసుపు, కుంకుమలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేదల కన్నీళ్లను తుడవడానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేద ప్రజలు ధైర్యంగా, ఆనందంగా తమ కుమార్తెల వివాహాలు చేస్తున్నారని అన్నారు. అప్పులపాలు కాకుండా తమ కుమార్తెలను అత్తవారింటికి పంపుతున్నారని అన్నారు. గత ఐదేళ్ల నుంచి తాను ఇలాగే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నానని గుర్తుచేశారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, ఆర్ఎస్ నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, దేవభక్తుని కిశోర్బాబు, మాటేటి కిరణ్కుమార్, ఆళ్ల అంజిరెడ్డి, జశ్వంత్, కంచర్ల దయాకర్, పాలడుగు పాపారావు, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.