సమన్వయంతో కొవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలి
హైరిస్కు ప్రాంతాల బాధితులను ఐసొలేషన్కు పంపాలి
వీడియో కాన్ఫరెన్సులో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, ఆగస్టు 11: జిల్లాలో కొవిడ్ పాజిటివిటీ రేటును పూర్తిగా తగ్గించాలని, ఇందుకోసం వైద్యాధికారులు మరింత కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొవిడ్, డెంగీ నియంత్రణ చర్యలు, నూతన సబ్ సెంటర్ల పనులు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు, నమూనాల సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండల వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రధానంగా గ్రామాల్లో కొవిడ్ కేసుల సఖ్యను తగ్గించేందుకు మెడికల్ అధికారులు తమ విధులను మరింత బాధ్యతయుతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో పాజిటివ్ కేసులు అధికంగా ఉంటే ఆ ప్రాంతాన్ని హైరిస్క్ ప్రాంతంగా గుర్తించాలన్నారు. పాజిటివ్ రోగులను గుర్తించి వారిని వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆర్యోగ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ డోసుల నిల్వలు ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ సంఖ్య తక్కువగా నమోదవుతోందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజు 500 మందికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా జరగాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తిని జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు మండల స్థాయి టాస్క్ఫోర్సు బృంద సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పాజిటివ్ రోగులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు.
అలాగే వ్యాక్సినేషన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల వద్ద పల్స్ ఆక్సీమీటర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో చేపడుతున్న నూతన సబ్ సెంటర్ల నిర్మాణ పనుల ప్రక్రియను వేగవంతం చేసి మూడు నెలలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగాల ద్వారా జిల్లాలో నూతన సబ్ సెంటర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సంబంధిత అధికారుల సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో డెంగీ నియంత్రణకు మరింత ముమ్మరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేపట్టాలన్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా సర్వేలెన్స్ అధికారి రాజేశ్, డీఐవో అలివేలు, డీఎంవో సంధ్య, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.