కొత్తగూడెం అర్బన్, మే 24 : ఆర్టీసీ సంస్థ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లు, జాతరల సమయాల్లో అదనపు బస్సులు నడుపుతూ అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుండగా.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగం, చదువులు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు శని, ఆదివారాలు స్వస్థలాలకు వస్తుంటారు. తిరిగి మళ్లీ సోమవారం ఉద్యోగం, చదివే కళాశాల, పాఠశాల, పనిచేసే ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ సంస్థ ‘మండే చాలెంజ్’ను నిర్దేశించింది. ఇందుకోసం సోమవారం బస్సుల సంఖ్యను పెంచి ప్రత్యేక రూట్లలో సర్వీసులను నడిపిస్తున్నది. అదనపు ఆదాయాన్ని సముపార్జిస్తున్నది.
ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉన్న ప్రతీ అంశాన్నీ అందిపుచ్చుకుంటోంది యాజమాన్యం. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లు, జాతరల సమయాల్లోనే డిపోల్లో ఉన్న బస్సులతోపాటు అదనంగా ఇతర డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంటారు. కానీ, ప్రతీ సోమవారం అత్యధికంగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉండేవారు.. వారాంతమైన శని, ఆదివారాల్లో స్వస్థలాలకు వస్తుంటారు. సోమవారం ఉదయమే తిరిగి ఉద్యోగం చేసే ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో ప్రత్యేకంగా సోమవారం రద్దీ బాగా ఉంటోంది. దీంతో ఆర్టీసీ సంస్థ ‘మండే చాలెంజ్’ను నిర్దేశించింది. ఇందులో భాగంగా సోమవారం నాడు బస్సుల సంఖ్యను పెంచి ప్రత్యేక రూట్లలో నడిపిస్తోంది. తద్వారా అదనపు ఆదాయాన్ని సముపార్జిస్తోంది.
సోమవారం అత్యధిక ఆదాయం..
ఈ నెల 15 నుంచి ప్రతీ సోమవారం డిపోలో ఉన్న ప్రతీ బస్సును ఆపరేట్ చేయాలని సంస్థ ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటించిన డిపోల మేనేజర్లు ఈ నెల 15, 22 తేదీల్లోని రెండు సోమవారాల్లోనూ మిగిలిన ఆరు రోజుల కంటే అత్యధిక ఆదాయాన్ని సముపార్జించారు. మండే చాలెంజ్లో భాగంగా భద్రాచలం డిపో లక్ష్యం రూ.22.29 లక్షలు కాగా.. రూ.23.47 లక్షల ఆదాయం వచ్చింది. కొత్తగూడెం డిపో లక్ష్యం రూ.13.40 లక్షలు కాగా. రూ.16.10 లక్షల ఆదాయం సమకూరింది. మణుగూరు డిపో లక్ష్యం రూ.16.20 లక్షలు కాగా.. రూ.18.17 లక్షల ఆదాయం వచ్చింది. భద్రాద్రి జిల్లాలోని మూడు డిపోలు దాదాపుగా 105 శాతం ఎర్నింగ్స్ను, 80 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకున్నాయి. సాధారణ రోజుల్లో అయితే కొత్తగూడెం డిపో రూ.10 నుంచి 12 లక్షలు, మణుగూరు డిపో రూ.16 లక్షలు, భద్రాచలం డిపో రూ.17 లక్షల ఎర్నింగ్స్ నమోదు చేస్తుంటాయి. ఒక్క సోమవారం అత్యధికంగా ప్రతీ డిపో అదనంగా సుమారు రూ.2 లక్షలకుపైగానే ఎర్నింగ్స్ను సంస్థ ఖాతాల్లో జమచేస్తోంది. ఈ చాలెంజ్ వల్ల దాదాపుగా రాష్ట్రంలోని అన్ని డిపోలూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి.
రైళ్ల రద్దుతో మరింత ఆదాయం..
మండే చాలెంజ్తోపాటు రైళ్ల రద్దు అంశం కూడా ఆర్టీసీకి కలిసివచ్చింది. కాజీపేట – కొండపల్లి రైలు మార్గంలో మూడో లైన్ నిర్మాణమవుతుండడం, నెక్కొండ, చింతపల్లి స్టేషన్ల మధ్య పనులు జరుగుతుండడం వంటి కారణాలతో మణుగూరు, కొత్తగూడెం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సిర్పూర్ టౌన్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్, బెళగావి రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులందరూ ఆర్టీసీపైనే ఆధారపడ్డారు. అనుకోకుండా వచ్చిన ఈ సదవకాశాన్ని ఆర్టీసీ చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. కొత్తగూడెం నుంచి ప్రతి రోజూ వరంగల్, హైదరాబాద్ వరకూ రాకపోకలు సాగించే ప్రయాణికులు సుమారు రెండువేల మందికిపైగానే ఉంటారు. ప్రస్తుతం రైళ్ల రద్దుతో వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా మరింత ఆదాయం సమకూరుతోంది.
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాం..
అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాం. రద్దీ ఉండే ప్రాంతాల్లో అదనపు సర్వీసులు నడిపిస్తున్నాం. గతంలో నష్టాల్లో కూరుకుపోయిన డిపోలు కొత్త విధానాల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. ఇది ఎంతో సంతోషించదగిన విషయం. మండే చాలెంజ్లో భాగంగా సోమవారాల్లో ప్రత్యేకంగా అత్యధికంగా ఎర్నింగ్స్ సాధించాలని సంస్థ నిర్ణయించింది. దానిని పక్కాగా అమలు చేస్తున్నాం. దీంతో మిగిలిన రోజుల కంటే సోమవారాల్లో ఎక్కువగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. ఈ అదనపు ఆదాయం సంస్థ పరిపుష్టికి ఉపయోగపడుతుంది.
–బాణాల వెంకటేశ్వరరావు, కొత్తగూడెం డిపో మేనేజర్