దుమ్ముగూడెం, మార్చి 3: టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక అన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్నందున టెన్త్ విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. మండలంలోని కొత్తపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన స్టడీ మెటీరియల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న పరీక్షల్లో 10కి 10 పాయింట్లు సాధించి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు స్పెషల్ మెనూను సక్రమంగా అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆశ్రమ ఉపాధ్యాయులు, నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షల్లో ప్రశ్నపత్రాలను ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకుని సమాధానాలు రాసేలా ప్రధానోపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారులు, పాఠశాల బాధ్యులు తెల్లం రమణయ్య, రూపాదేవి, పూనం నర్సింహారావు, మడకం మోతీరు, సర్వేశ్వర్, హరికృష్ణ, పార్వతి, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ఆంజనేయులు, బొడియ, సత్యనారాయణ, ప్రేమ్కుమార్, చెన్నారావు, లక్ష్మయ్య, కల్యాణి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.