కొత్తగూడెం/ ఖమ్మం మామిళ్లగూడెం, నవంబర్ 5: సమస్యలకు తావు లేకుండా అర్హులకు న్యాయం జరిగేలా పోడు సర్వే ప్రక్రియ నిర్వహించాలని అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి సూచించారు. పోడు భూముల సర్వే, అటవీ భూముల పరిరక్షణ ప్రక్రియపై కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లలో ఐటీడీఏ, అటవీ అధికారులతో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో 343 గ్రామ పంచాయతీల్లోని 726 హ్యాబిటేషన్లలో 2,29,229 ఎకరాల అటవీభూమి ఆక్రమణ జరిగినట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి వచ్చేనెల 8 వరకు జరుగనున్న పోడు భూముల సర్వే ప్రక్రియకు 501 బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో కమిటీలు పర్యటించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. పోడు సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా భద్రాద్రి కలెక్టరేట్లో 08744-241910 ఫోన్ నెంబర్ను, 9392919743 వాట్సప్ నెంబరును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ మాట్లాడుతూ అటవీ హక్కుల కమిటీ టీంల ఏర్పాటు, డివిజన్, జిల్లాస్థాయిలో కమిటీ విధుల గురించి వివరించారు. సీఎఫ్వో భీమానాయక్, డీఎఫ్వో రంజిత్నాయక్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రైనీ డీఎఫ్వో నీరజ్, ఎఫ్డీవోలు పాల్గొన్నారు.
ఖమ్మంలో 112 బృందాలు
పోడు సాగు చేసుకుంటున్న పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పోడు భూముల సర్వేలో అర్హులందరికీ గరిష్ట ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ 112 మందితో పంచాయతీ స్థాయి బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చామన్నారు. 125 మందితో అటవీ హకుల కమిటీల ఏర్పాటు ప్రక్రియలో ఉందని వివరించారు. ట్రైనీ కలెక్టర్ రాహుల్, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎఫ్వో ప్రవీణ, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ వీ.రాము, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణానాయక్, డీఎఫ్వోలు ప్రకాశ్, సతీశ్కుమార్ పాల్గొన్నారు.