అప్పటి వరకూ గెలల ధరకు ఢోకాలేదు
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పరిశ్రమ
బురద అంటకుండా పామాయిల్ సాగు
ఎకరాకు రూ.36 వేలు ప్రభుత్వ రాయితీ
రైతుబంధుతోపాటు ఇతర పోత్సాహకాలు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటన
దమ్మపేట రూరల్/ దమ్మపేట, ఆగస్టు 5: రాబోయే 30 ఏళ్ల వరకు పామాయిల్ గెలల ధరకు భరోసా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 57 ఏళ్లకు సవరించినందుకు సదాశివునిపాలెంలో మంత్రి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటికొండ రాజయ్యతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం కరివేద సాగును పరిశీలించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అల్లిపల్లి, మందలపల్లి గ్రామాల్లో పామాయిల్ సాగును ఎమ్మెల్యేలు రాజయ్య, నాగేశ్వరరావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అల్లిపల్లిలో పామాయిల్ సాగు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
రైతుల కాళ్లకు, చేతులకు బురద అంటకుండా పామాయిల్ సాగు చేయవచ్చని తమ క్షేత్ర స్థాయి అధ్యయనంలో అర్థమైందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దమ్మపేట మండలంలోని అల్లిపల్లి, మందలపల్లి గ్రామాల్లో పామాయిల్ సాగును ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మెచ్చా నాగేశ్వరరావులతోపాటు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అల్లిపల్లిలో రైతులతో జరిగిన సమావేశంలో పామాయిల్ సాగు గురించి సాగుచేస్తున్న ఈ ప్రాంత రైతులను అడిగి తెలుసుకున్నారు. పామాయిల్ మొక్కలు నాటిన తరువాత కాతకు వచ్చే వరకు ఎకరాకు రూ.36 వేలు ఖర్చవుతుండగా ఆ మొతాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నెలకొల్పబోతున్నామన్నారు. పామాయిల్కూ రైతుబంధు వర్తిస్తోందన్నారు. రాబోయే 30 ఏళ్ల వరకు పామాయిల్ పండ్ల గెలల ధరకు భరోసా ఉంటుందని వరంగల్ అర్బన్ జిల్లా రైతు యాదగిరి ప్రశ్నకు జవాబిచ్చారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి శ్రీనివాస్రావు, మరియన్న, విజయ్, పీఆర్ ఈఈ సుధాకర్, తహసీల్దార్ రంగా ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్, అంకిత ఉమామహేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలన
దమ్మపేట రూరల్, ఆగస్టు 5: అప్పారావుపేట పామాయిల్ కర్మాగారాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మెచ్చా నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. గెలల అన్ లోడింగ్, క్రషింగ్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తదితర ప్రక్రియల గురించి ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి వివరించారు. ఫెడ్ డీఎం బాలకృష్ణ, డీహెచ్వో మరియన్న పాల్గొన్నారు.
ఆయిల్పాం నర్సరీ సందర్శన
అశ్వారావుపేట, ఆగస్టు 5: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కలిసి అశ్వారావుపేటలో గురువారం పర్యటించారు. ముందుగా నారంవారిగూడెంలోని ఆయిల్పాం నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. వివరాల గురించి డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణను అడిగారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి పక్కన హరితహారంలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సొసైటీ అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు బండి పుల్లారావు, జేకేవీ రమణారావు, బండారు శ్రీనివాసరావు, కాసాని చంద్ర మోహన్, వెంకటేశ్వరరావు, డీహెచ్వో జీనుగు మరియన్న, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.