సత్తుపల్లి, ఆగస్టు 5: కరివేద పద్ధతి రైతులకు ఎంతో మేలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో రైతులు కరివేద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంటను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి గురువారం పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరివేద సాగు ద్వారా రైతులకు పెట్టుబడి, సమయం ఆదా అవుతాయని అన్నారు. అధిక దిగుబడులూ వచ్చే అవకాశం ఉందన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు కరివేద పద్ధతిపై మక్కువ చూపుతున్నారన్నారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గంలో కరివేద పద్ధతిలో సాగవుతున్న పంటలను పరిశీలించేందుకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి 300 మంది రైతులు ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. సదాశివునిపేట చేరుకొని పంటలను పరిశీలించారు. అనంతరం సాగు వివరాల గురించి స్థానిక రైతులతో అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఏవో విజయనిర్మల, డీహెచ్వో అనసూయ, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో ప్రభాకర్రావు, పీఆర్ ఈఈ జీవీ చంద్రమౌళి, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆర్డీవో సూర్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ సీఈ పుష్పలత, డీఈ స్వరూపరాణి, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు నళిని, అభిషేక్, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, నాయకులు గాదె సత్యం, చల్లగుళ్ల కృష్ణయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.