కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 9 : మన సంస్కృతిని భావితరాలకు అందించాలని, అందుకు డిజిటలైజేషనే మంచి మార్గమని శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ మల్లేశ్ పేర్కొన్నారు. ‘భారతీయ సాహిత్యం.. సంస్కృతిలో డిజిటల్ హ్యుమానిటీస్ అన్వేషణ సవాళ్లు’ అంశంపై శ్రీరాజరాజేశ్వర (ఎస్సారార్) డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు గురువారం వీసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మౌఖిక భాష నుంచి డిజిటల్ భాష వరకు జరిగిన పరిణామ క్రమం సమాజ జీవన వికాసానికి అద్దం పడుతున్నదని చెప్పారు. ప్రొఫెసర్, ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ జర్మనీ నుంచి ఆన్లైన్లో తొట్టెంపుడి గణేశ్ మాట్లాడుతూ.. సాహిత్యం, భాష సంస్కృతిపై క్రమంగా క్షీణిస్తున్న అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే సాహిత్యాన్ని తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలన్నారు.
ఇప్పుడు జర్మనీలో 12 యూనివర్సిటీల్లో తెలుగు సంస్కృత భాషలపై విస్తృత చర్చ జరుగుతున్నదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ దినచర్యలో డిజిటల్ మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివేచన, విశ్లేషణ, ప్రమాణీకరణ, సూత్రీకరణ అనే అంశాల ఆధారంగా సంస్కృతి మూలాలను సంరక్షించుకోవాలని సూచించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థికి సరిపోయే సిలబస్ రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 45 మంది పరిశోధనాపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఎం రాధిక, అధ్యాపకులు డాక్టర్ ఈ ప్రమోద్ కుమార్, డాక్టర్ పీ విశ్వప్రసాద్, డాక్టర్ కే శారద, ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్ అశోక్, డాక్టర్ చైతన్య, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు.