
BRS | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 29 : ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నామని, ఆ స్పూర్తిని అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన నిరసనల కార్యక్రమాల పిలుపులో భాగంగా స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేవంత్రెడ్డి 420 హామీలు ఇచ్చి 1000 రోజులల్లో మోసంపై పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు చేపట్టే నిరసన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
నాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై ప్రజలు ఒక అంచనాకు వచ్చారని, అది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసని విమర్శించారు. ఇది వరకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లంకెబిందెల కోసం వచ్చామని, ఇక్కడేమీ లేవని పబ్లిక్ వేదికలపై చెప్పిన మాటలను గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ నాయకులు అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారని, ఇక భవిష్యత్లో కాంగ్రెస్ అధికారం రాలేదనే విశయం కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థమైపోయిందని ఘాటుగా విమర్శించారు.
బీఆర్ఎస్ నియోజక వర్గ ఇంచార్జి తుల ఉమ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజక వర్గంలోని ప్రజలు చైతన్య వంతులని మోసం చేసిన తీరుపై ఇది వరకే వారు సోయిలో ఉన్నారని ఏఏ వర్గాలను ఎలా ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందో కొంత అవగాహన కల్పిస్తే సరిపోతుందని తెలిపారు. ప్రతీ నిరసన కార్యక్రమం విజయవంతం అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.