భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ తీరు ఆది నుంచీ వివాదాస్పదమవుతున్నది. ఆయన వ్యవహార శైలిపై పార్టీ క్యాడర్ భగ్గుమంటున్నది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిల దాకా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఆయన తీరుకు వ్యతిరేకంగా పలువురు గళం విప్పగా.. తాజాగా జాతీయ అధ్యక్షుడు నడ్డా నిర్వహించిన వర్చువల్ మీటింగ్ సాక్షిగా సీనియర్లు తిరుగుబాటు చేశారు. ధర్మపురి వేదికగా నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు కన్నం అంజయ్య తిరుగుబాటు చేశారు.
పాత వారిని పక్కనపెట్టి.. కొత్త వారిని అందలమెక్కిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇరవై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తే.. నియోజకవర్గ ఇన్చార్జినైన తననే స్టేజీ మీదకు ఆహ్వానించకుండా అవమానిస్తారా..? అంటూ నిలదీశారు. ఈ సమయంలో సర్దిచెప్పాల్సింది పోయి, ‘ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ వివేక్ దురుసుగా ప్రవర్తించడంపై నాయకులు భగ్గుమన్నారు. ఈ విషయంలో అంజయ్యకు మెజార్టీ నాయకులు మద్దతు ఇస్తుండగా, వివేక్ తీరుపై ఇక తాడోపేడో తేల్చుకోవడానికి చాలా మంది సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణప్రతినిధి)/ ధర్మపురి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం వర్చువల్ విధానంలో నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా ధర్మపురి ఎస్సారార్ గార్డెన్స్లో నియోజకవర్గ కన్వీనర్ కస్తూరి సత్యం అధ్యక్షతన నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్చువల్ విధానంలో ముందుగా రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ఆ తర్వాత స్థానిక నాయకులు మాట్లాడుతున్న సమయంలో నియోజకవర్గ మాజీ కన్వీనర్ రాంబాబు లేచి పార్టీకి వ్య తిరేకంగా నినాదాలు చేశారు.
నియోజకవర్గ ఇన్చార్జి, ధర్మపురి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసిన కన్నం అంజయ్యను స్టేజీ మీద కు ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని సభికులను నిలదీశారు. ఇదే సమయంలో కన్నం అంజ య్య కూడా అక్కడకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు. నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే ని యోజకవర్గ ఇన్చార్జీలకు సమాచారం ఇవ్వరా..? అంటూ ప్రశ్నించారు.
గడిచిన ఇరువై ఏళ్లుగా పార్టీకి సేవ చేయడమేకాదు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న విషయాన్ని మరిచిపోయారా..? అంటూ నిలదీశారు. నక్సల్స్ ప్రాబల్యమున్న సమయంలో ప్రాణాలు ఎదురొడ్డి బీజేపీ జెండాను చేతబట్టుకొని క్రియాశీలకంగా పనిచేశామని, పార్టీని కాపాడుకుంటూ ఇంత సేవ చేస్తే.. స్టేజీ మీదకు ఆహ్వానించకుండా అవమానిస్తారా..? అంటూ నిలదీశారు. పాత వారిని పక్కనపెట్టి.. కొత్త వారు రాజ్యమేలుతున్నారని, పార్టీ నియమ నిబంధనలు, మూల సిద్ధాంతాలను తుంగలో తొ క్కుతున్నారని దీనికి సమాధానం చెప్పాలంటూ వివేక్ను నిలదీశారు.
పరిస్థితి ఉద్రక్తంగా మారుతున్న నేపథ్యంలో వివేక్ స్టేజీ పై నుంచి కిందకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు అసభ్యకర పదజాలంతో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో రసాభసగా మారింది. ఈ సమయంలో ఏ నాయకుడైనా తప్పును గుర్తించి సర్దిచెప్పాలి. కానీ, అలా కాకుండా ‘ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ వివేక్ మాట్లాడిన తీరు అక్కడి నాయకులను మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మనోవేదనకు గురైన కన్నం అంజయ్య తన అనుచరులతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సీనియర్ నాయకుడైన అంజయ్యను గౌరవించాల్సిందిపోయి ఆయనతో దురుసుగా మాట్లాడిన తీరుపై నేతలు భగ్గుమంటున్నారు.
ఆది నుంచీ అదే తీరు
నిజానికి వివేక్ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీలోని సీనియర్లను, పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వారిని పక్కపెట్టడం ఆయనకు రివాజే అన్న విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన సమయంలోనూ అదే పంథాను అనుసరించారు. దీంతో చాలా సార్లు ఆయన వ్యవహారశైలిపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తదుపరి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో ఉన్నప్పుడు అదే విధానంతో ముందుకు సాగారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీజేపీలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. ఆ పార్టీలో ఆది నుంచీ పనిచేస్తున్న నాయకులను కాదని, పార్టీ కోసం ముందు నుంచీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి ఆయనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.
బాహాటంగానే విమర్శలు
గతంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు మంచిర్యాలలో వివేక్కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఆయన తీరు మార్చుకోవాలని గళం విప్పారు. ఇటీవల ప్రధాని సభ రామగుండంలో జరిగినప్పుడు ఆ సభకు వివేక్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ సమయంలోనూ సీనియర్లను, పార్టీకి సేవ చేసిన వారికి కనీస సమాచారం ఇవ్వకపోవడం, సభకు పాస్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి గుజ్జుల రామకృష్ణ రెడ్డి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన వారిని వివేక్ లాంటి నాయకులు ఎలా అవమానిస్తున్నారో ఆయన వివరించారు. ఇంత జరుగుతున్నా వివేక్ మాత్రం ఎవరిని కలుపుకొని పోవ డం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంపైన కొందరు నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.
శ్రేణుల్లో అంతర్మథనం
నిజానికి కన్నం అంజయ్య బీజేపీలో సీనియర్ నాయకుడు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతేకాదు, ఆయ న న్యాయవాది. అలాగే ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, గత ఉమ్మడి జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిగా, బాబు జగ్జీవన్రామ్ ఉత్సవ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అతని రాజకీయ ప్రస్థానం అంతా బీజేపీలోనే కొనసాగుతున్నది. దాదాపు ఇరువై ఏండ్ల సీనియర్ నాయకు డు కన్నం అంజయ్యపై వివేక్ అనుసరించిన వ్యవహారశైలి పార్టీ నాయకులను ఒక్కసారిగా అంతర్మమథనంలో పడేసింది. తప్పును సరిదిద్దుకోకుండా ఎవరికి ‘చెప్పుకుంటావో చెప్పకో’ అంటూ మాట్లాడిన తీరు నాయకులను ఆలోచింపజేస్తున్నది.
పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి కేవలం ధనబలం ఉందన్న ఒకే కారణంతో వివేక్కు కొంత మందిపై నాయకులు మద్దతు ఇస్తున్నారని, అ లాంటప్పుడు.. ఇన్నేళ్లుగా జెండా మోసిన నాయకుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రస్తుతం ఆ పార్టీలో ఉత్పన్నమవుతున్నది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే వివేక్పై బాహాటంగానే తిరుగుబాటు చేయడానికి పలువురు సీనియర్ నాయకులు సన్నద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నది.
నిజానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి,రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో వివేక్కు వ్యతిరేకంగా కదిలేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తున్నది. దీనికి కొం త మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు సార థ్యం వహించడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదని తెలుస్తున్నది. కాగా, సీనియర్ నాయకుడు అంజయ్యపై వివేక్ అనుసరించిన దురుసు ప్రవర్తనపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.