కథలాపూర్, డిసెంబర్ 21 : ప్రజల ఓట్లతో గెలిచి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో 1.13 కోట్లతో చేపట్టే బ్రిడ్జి మరమ్మతు పనులు, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 35 లక్షలతో నిర్మించే ప్రహరీ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతిని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. బొమ్మెన జడ్పీ హైస్కూల్కు సొంత నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంలోని ప్రజలకు, పాఠశాలలోని విద్యార్థులకు వేర్వేరుగా మినరల్ వాటర్ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సంఘం భవనానికి నిధులు మంజూరు చేస్తామని, డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులైన వారికే న్యాయం చేస్తామన్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతిరెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఏఎంసీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్రావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గడీల గంగాప్రసాద్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్రావు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో జనార్దన్, ఎంపీవో గంగాధర్, ఎస్ఐ రామచంద్రం, ఎంఈవో ఆనందరావు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మేడిపల్లి, డిసెంబర్ 21: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. మేడిపల్లి మండలకేంద్రంలో భరతమాత మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ (వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రం)ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు బుధవారం ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించిన నూతన పీఏసీఎస్ నూతన భవన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని 30 మందికి, భీమారం మండలంలోని 31 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి, అడిషనల్ డీఆర్డీవో సుధీర్, డీసీవో రామానుజచార్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు ఈర్నాల సంపత్కుమార్, నాంచారి స్వప్న, ఎంపీటీసీలు అంకం వినోద, మకిలి దాస్, నెల్లుట్ల పూర్ణిమ, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మిట్టపెల్లి రమేశ్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రవీందర్రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, ఏపీఎం గట్ల అశోక్, సీఈవో బొందయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, నాయకులు దోనకంటి రాజరత్నాకర్రావు, తోకల రవీందర్ పాల్గొన్నారు.
కథలాపూర్, డిసెంబర్ 21: బొమ్మెన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.35 లక్షలతో నిర్మించే ప్రహరీ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుపై విద్యార్థులు పూలవర్షం కురిపించారు. పాఠశాల ఆవరణలో ప్రహరీ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని, 20 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపి నేడు పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే రమేశ్బాబుకు పూల వర్షంతో విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందనందుకు సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే రమేశ్బాబుకు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.