వేములవాడ టౌన్, జనవరి 11 : లయ బ్రహ్మ, నాద బ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామివారి 70వ ఆరాధనోత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సంగీత ప్రియులను ఆద్యంతం అలరించాయి. ఉదయం 7 గంటలకు స్వస్తి పుణ్యాహవాచనంతో ప్రారంభం కాగా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల, కళాశాల విద్యార్థులు నగర సంకీర్తన చేశారు. అనంతరం వేదికపై పురాణం మహేశ్వర శర్మ, చౌటి లక్ష్మణ్ త్యాగరాజస్వామి జీవిత విశేషాలను తెలిపారు. ఉదయం 9 గంటలకు రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు కొరిడె నరహరి, మంజుల, రేవతి, అనుపమ బృందం చేసిన పంచరత్న గానం ఆహూతులను అలరించింది.
త్యాగరాజ పంచారత్నాల్లో జగదానంద కారక, ఎందరో మహానుభావులు కీర్తనలు సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి. 11.30గంటలకు శిఖామణి భాగవతార్ హరికథ, సాయంత్రం 4 గంటలకు రాయప్రోలు సుబ్రహ్మణ్యం హరికథ, సాయంత్రం 5.30 గంటలకు శ్రీవిద్య శాస్త్రీయ సంగీత కచేరి శ్రోతలను ఆనందడోలికల్లో ఓలలాడించింది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రామ తత్వాన్ని లోకానికి అందించిన భాగవతోత్తముడు త్యాగరాజస్వామివారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.