మారుతున్న కాలానికనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధునిక విధానాలు.. సరికొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు మరింతగా తీసుకెళ్లేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ సేవలు మరింత విస్తరణ.. ఆదాయ మార్గాలను సుగమమం చేసుకునేందుకు ఆర్టీసీ విలేజీ బస్ అధికారితో పాటు మున్సిపల్లో వార్డు ఆఫీసర్ను కూడా నియమించేందుకు సిద్ధమవుతున్నది. కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు ఈ విధానం అమలుకు శ్రీకారం చుడుతున్నది.
జమ్మికుంట, ఏప్రిల్ 30: రాష్ట్రవ్యాప్తంగా 10వేలకు పైగా గ్రామాల్లోని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సేవలందిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలున్నాయి. 318 రూట్లు.. 1349 గ్రామాల్లో బస్సు సర్వీసుల సేవలు అందుతున్నాయి. ఆర్టీసీ లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉన్నత ప్రమాణాలతో సేవలందిస్తు ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది. అయితే ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సర్కారు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా విలేజీ బస్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. బస్సు ఆఫీసర్ల నియామకం ఒక్క గ్రామాలకే పరిమితం చేయకుండా మున్సిపల్లోని ప్రతి వార్డుకో అధికారిని కూడా నియమిస్తారు. ఆర్టీసీలో పనిచేసే కండక్టర్, డ్రైవర్ తదితర ఉద్యోగులు గ్రామాల నుంచి వస్తుంటారు. విధులు నిర్వహిస్తుంటారు. సదరు ఉద్యోగులకు ఆయా గ్రామస్తులతో సత్సంబంధాలుంటాయి. ప్రజలతో మమేకమై.. కలిసిమెలిసి ఉండే వారిని గ్రామాల్లో అధికారులుగా నియమించే ఆలోచనలో సంస్థ ఉంది. పెద్ద గ్రామానికైతే ఒక్కరు, చిన్న గ్రామాలైతే.. రెండు, మూడింటికి కలిపి ఒక ఆఫీసర్ను నియమించే అవకాశం ఉంది. అధికారుల నియామకం సంబంధిత డిపో మేనేజర్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంద మంది ఆఫీసర్లను గుర్తించగా, త్వరలోనే పూర్తిస్థాయిలో నియామకాలు జరుపనున్నారు.
నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్లే దిశగా సంస్థ చకచకా అడుగులు వేస్తోంది. విలేజీ, మున్సిపల్లో బస్సు అధికారుల నియామకం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరుగనున్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం డిపో వరకు వెళ్లే పరిస్థితులుండేవి. లేదంటే ప్రజాప్రతినిధులు చొరువ తీసుకుంటేనే పరిష్కారమార్గాలు దొరికేవి. ఇప్పుడా సమస్యలన్నింటికీ చెక్ పడనుంది. విలేజీ ఆఫీసర్ నియామకంతో ప్రతి 15 రోజులకోసారి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా, యువజన సంఘాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులతో సమావేశం కానున్నారు. బస్సుల రాకపోకలు, సమయ వేళలు, కొత్త రూట్లు, అదనపు సర్వీసులు, ట్రిప్పులు, పెళ్లిల్ల కోసం అద్దె బస్సులు, రాయితీ, తదితర అంశాలపై చర్చ జరుగనున్నది. ఆర్టీసీ అందించే సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. చర్చలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి వీబీవోలు తీసుకెళ్లనున్నారు. అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం దొరుకనున్నది. ఆదాయం సైతం పెరుగనుంది. ఇక అధికారుల పేరు, ఫోన్ నంబర్, వివరాలను గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లోని నోటీస్ బోర్డులపై పొందుపరుస్తారు.
సంస్థ నిర్ణయం బాగున్నది. పల్లెకో బస్సు ఆఫీసర్ నియామకం చేస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతది. మాది ఇల్లందకుంట మండలం మల్యాల. డ్యూటీలు ఎట్టెస్తరో ఇంకా పూర్తిగా తెలియలే. ఎవరి ఊళ్లే వాళ్లనే పెడితే మంచిదే. అక్కడి ప్రజలతోటి కలిసి, మెలిసి పనిజేసే అవకాశం ఉంటది. చూడాలే.. ఎట్టుంటదో.
-గొర్రె రమేశ్, కండక్టర్(హుజూరాబాద్ డిపో)
ఊరికో బస్సు అధికారిని పెడ్తమని చెబుతున్నరు. ప్రభుత్వం మంచి పనిజేత్తంది. ఊళ్లనే ఓ ఆర్టీసీ అధికారి ఉంటే ఏ విషయమైనా చెప్పచ్చు. జనం ఎక్కువుంటే బస్సులెపియ్యచ్చు. శుభకార్యాలకు బస్సు కిరాయికి తెప్పియ్యచ్చు. ఇబ్బందులన్నీ పోతయ్. ప్రైవేట్ దిక్కెవ్వలూ సూడరు. ప్రమాదాలు జరుగవు. ఇబ్బంది లేకుండా బస్సులల్ల పోతరు. ఇంటికే బస్సత్తందంటే మంచిదేకదా.
-నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, ప్రయాణికుడు(మడిపల్లి)