హుజూరాబాద్, మే 24: హుజూరాబాద్లో టీఎస్ఎంసీ వైద్యబృందం రంగంలోకి దిగింది. శుక్రవారం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించింది. అనుమతులు లేని దవాఖానలపై చర్యలకు సిఫారసు చేయడంతోపాటు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వెల్లడించింది. అయితే, తనిఖీలతో పలు ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు హడలిపోయారు. అనుమతులు లేకపోవడంతో ముందుగానే క్లినిక్లకు తాళాలు వేసి తప్పించుకున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్లోని ప్రకృతి చికిత్సాకేంద్రంలో 400 మంది రోగులకు కంటి చుక్కలు వేసి పొరలు తొలగిస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) సీరియస్గా తీసుకున్నది. చైర్మన్ మహేశ్కుమార్ ఆదేశాలతో డాక్టర్లు నరేశ్ కుమార్, రాజకుమార్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం రంగంలోకి దిగింది. శుక్రవారం ప్రకృతి చికిత్సా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. నిర్వాహకుడు కలకోటి కిషన్రావును ప్రశ్నించింది. ఆయన ఆయుర్వేద వైద్య విద్య, నాచురోపతిలో ఓపెన్ డిగ్రీ చేసినట్టుగా సర్టిఫికెట్లు చూపించగా, ఆయుర్వేదిక్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కానీ, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించింది.
సదరు కంటి వైద్య శిబిరం మహర్షి గోశాలలో నిర్వహించినట్టు, ప్రతి నెలా అకడ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు కిషన్రావు తెలుపగా, ఇక నుంచి నిర్వహించవద్దని చెప్పింది. అలాగే వైద్యబృందం సభ్యులు హుజూరాబాద్ మారెట్ రోడ్లోని సంజీవని, శ్రీరామ, సూర్య పాలి క్లినిక్ల్లో కూడా తనిఖీ చేశారు. వీటికి జిల్లా అధికారుల నుంచి కూడా అనుమతులు లేవని, పదుల సంఖ్యలో బోర్డులపై డాక్టర్ల పేర్లు రాసిపెట్టి లోపల ఒక క్వాలిఫైడ్ వైద్యుడు కూడా ఉండడం లేదని, అటువంటి బోర్డ్స్ తొలగించాలని సూచించారు.
అన్ని క్లినిక్స్లో ఇన్పేషెంట్స్ బెడ్స్ కూడా నిర్వహిస్తున్నారని గుర్తించి, అనుమతిలేని ఈ సెంటర్లను సీజ్ చేయాలని జిల్లా అధికారులకు సిఫారసు చేశారు. అలాగే, మొత్తం తనిఖీలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని, చర్యలకు సిఫారసు చేస్తామని చెప్పారు. ఆకస్మిక తనిఖీల విషయం తెలుసుకున్న పలు ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు వణికిపోయారు. క్లినిక్లకు తాళాలు వేసి పారిపోయారు. తనిఖీ చేసిన వారిలో కరీంనగర్ జిల్లా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ వెంకట్ రెడ్డి, హెచ్అర్డీఏ సెక్రెటరీ డాక్టర్ శరణ సాయి, డాక్టర్ పసుల గౌతం ఉన్నారు.