రిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులెవరనేది తేలింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ l54 మంది విత్ డ్రా
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నేటి నుంచి ముమ్మర ప్రచారం
బీఆర్ఎస్కు పెరిగిన మద్దతు
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల బరిలో 75 మంది నిలిచారు. 15 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో ఒక్క అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. మిగతా 129 మంది అభ్యర్థుల్లో 54 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్నవారిలో బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులు 15 మంది కాగా, వివిధ పార్టీల నుంచి 35 మంది, 25 మంది స్వతంత్రులు ఉన్నారు. కాగా, నామినేషన్లు ఉపసంహరించుకున్న వారందరూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. అమాత్యుడు కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
రాజన్నసిరిసిల్ల, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులెవరనేది తేలింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. 15 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు వేయగా, అందులో ఒక్క అభ్యర్థిని అనర్హుడిగా పేర్కొంటూ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. 129 మంది అభ్యర్థుల్లో 54 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో అధికార బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులు 15 మంది కాగా, వివిధ పార్టీల నుంచి 35 మంది, 25 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు శనివారం రాత్రి గుర్తులను కేటాయించారు. బరిలో నిలిచిన అభ్యర్థులంతా మరుసటి రోజు నుంచే ప్రచారంలోకి వెళ్తున్నందున గుర్తులు కేటాయించి, ప్రింట్ చేయించారు. అప్పటి వరకు అభ్యర్థులంతా ఎన్నికల కార్యాలయంలోనే ఉండిపోయారు. గుర్తులు తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సామగ్రి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బరిలో ఉంటామని నిర్ణయించుకున్న వివిధ పార్టీల అభ్యర్థులు ముందే ప్రచార సామగ్రి మొత్తం డిజైన్లను రూపొందించి పెట్టుకున్నారు. అధికారులు గుర్తులు కేటాయించడంతో వెంటనే తమ గుర్తులతో ప్రచార సామగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు, 255 గ్రామ పంచాతీల్లో అభ్యర్థులంతా పోటీపోటీగా ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీరువాలు, బ్యాట్, టార్చిలైట్, బ్రష్, బకెట్, ఇలా రకరకాల గుర్తులు కేటాయించారు. కాగా, సిరిసిల్లటౌన్-1లో (2), సిరిసిల్ల టౌన్-2 లో (10), తంగళ్లపల్లిలో (5), ఇల్లంతకుంటలో (5), గంభీరావుపేటలో (7), ముస్తాబాద్లో (5), ఎల్లారెడ్డిపేటలో (4), వీర్నపల్లిలో (5), చందుర్తిలో (4), రుద్రంగిలో (6), కోనరావుపేటలో (7), వేములవాడ టౌన్-1లో (3),వేములవాడ టౌన్ -2లో (5),వేములవాడ రూరల్ (3), బోయినిపల్లి (4) అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు పెరిగిన మద్దతు
పార్టీలకతీతంగా జరుగుతున్న సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులకు ప్రజల్లో మద్దతు పెరుగుతున్నది. 129మంది నామినేషన్లు వేసిన వారిలో 55 మంది మద్దతు ప్రకటిస్తూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఉన్న సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం దేశంలోనే ఒక్కటి. అది కూడా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా అధికార యంత్రాంగం, పాలకవర్గాలు విశేష కృషిచేశాయి. అమాత్యుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా గుర్తులు
బరిలో నిలిచిన అభ్యర్థులకు సహకార చట్టం ప్రకారం నియోజకవర్గాల వారీగా గుర్తులు కేటాయించాం. 129 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అం దులో 54మంది ఉపసంహరించుకున్నారు. 75 మంది బరిలో నిలిచారు. ఈ నెల 24న నిర్వహించే ఎన్నికల కోసం 252 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం.