కార్పొరేషన్, జూన్ 19: రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధ్ది చెందుతున్న కరీంనగర్లో మరిన్ని స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్సిటీ కింద చేపట్టిన పనులు పూర్తి కాగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోఫ్రీ వైఫై హాట్స్పాట్స్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నిల్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంకు అంకురార్పణ చేయనున్నారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార సముదాయాల నుంచి సేకరించే చెత్తను కూడా ఇకపై ట్రాకింగ్ చేసే అత్యాధునిక సాంకేతిక సేవలను కూడా ప్రారంభించనున్నారు.
షాపుల నుంచి చెత్త సేకరణకు ఆర్ఎఫ్ఐడీ
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, షాపుల నుంచి చెత్త సేకరణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించునున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి చెత్త ఆటోల ద్వారా సేకరణ చేపట్టగా పలువురు షాపు యజమానులు చెత్తను రోడ్లపై వేసేవారు. ఇందుకు చెత్తవాహనాలు రాకపోవడమే కారణమని చెప్పేవారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు నగరపాలక సంస్థ ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటీఫికేషన్ డిజైన్) విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో స్వచ్ఛ ఆటోలకు దీనికి సంబంధించి యాప్తో కూడిన డివైస్ను అందిస్తున్నారు. అలాగే షాపు యజమానులకు ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేస్తారు.
ఇప్పటికే నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద 5150 కమర్షియల్ షాపులకు ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీని లింక్ చేశారు. వీరి నుంచి ఈ పద్ధతిలో ప్రస్తుతం చెత్తను సేకరించే ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతున్నది. ఈ విధానంలో ఆయా వాణిజ్య సంస్థల నుంచి ప్రతి రోజూ ఏ సమయంలో చెత్త సేకరిస్తున్నారో పరిశీలించడంతోపాటుగా ఏ మేరకు చెత్త వస్తున్నదని కూడా తెలుసుకోవడానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏయే వ్యాపార సంస్థల యజమానులు ప్రతి రోజూ చెత్తను అందిస్తున్నారు.. ఎవరు అందించడం లేదన్న విషయం కూడా తెలుసుకోవడానికి వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. నగరంలోని అన్ని వ్యాపార సంస్థలకు ఈ విధానాన్ని అమలు చేయడంతోపాటు ప్రతి 400 షాపులకు ఒక స్వచ్ఛ ఆటోను కేటాయించనున్నామని అధికారులు తెలిపారు. దీని వల్ల ప్రతి షాపు నుంచి చెత్త సేకరణకు అవకాశం ఉంటుందని తెలిపారు.
బల్దియా ఆఫీసులో కంట్రోల్ సెంటర్
స్మార్ట్సిటీ పనుల్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ వ్యవస్థ, పర్యావరణ పరిస్థితులు తెలుసుకొనేందుకు రూ.94 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికే పూర్తి కాగా వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాత్కాలికంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. ఈ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ వాల్, కంట్రోల్ రూం, 14 చౌరస్తాల్లో ఆటోమెటెడ్ ట్రాఫిక్ సిగ్నిల్స్, 18 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని రకాల సమాచారం అందించే డిస్ప్లే బోర్డులు, ఐదుచోట్ల ఏర్పాటు చేసిన ఎన్విరాల్మెంట్ సెన్సార్లు, 18 ప్రాంతాల్లో ఫ్రీ వై ఫై హాట్ స్పాట్స్ను ప్రారంభించనున్నారు.