కొత్తపల్లి, ఫిబ్రవరి 12 : క్రీడల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనడమే గొప్ప విషయమని బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం సుడా చైర్మన్ కప్-2023 పేరిట నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలను ఆయన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పోటీతత్వంతో కూడిన నేటి సమాజంలో విద్యార్థులకు చదువు ఎంతో ముఖ్యమో క్రీడలు సైతం అంతే ముఖ్యమన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక ధృఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడలు, క్రీడా పోటీలతో విద్యార్థులకు క్రమశిక్షణ, కష్టపడేతత్వం అలవడుతుందన్నారు. ఉద్యోగ నియామకాలతో పాటు ఉన్నత విద్యలో సైతం క్రీడాకారులకు రిజర్వేషన్ను కల్పిస్తుందన్నారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కరాటే యుద్ధ విద్యయే గాక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందన్నారు. పోటీల నిర్వాహకుడు, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ సంస్థల అధినేత కే వసంత్కుమార్ గత 40 ఏళ్లుగా కరాటే అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ పోటీల్లో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, షిహాన్ సంపత్ కుమార్, కే మొండయ్య, సీనియర్ బ్లాక్ బెల్ట్స్ హోల్డర్స్, కరాటే ఇన్స్ట్రక్టర్లు, అఫీషియల్స్ ప్రదీప్ కుమార్, మన్నన్, లింగయ్య, శ్రీనివాస్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.